కొత్తగూడెం: మున్సిపల్ బడ్టెట్ వాస్తవాలకు దగ్గరగా ఉందని, ఎటువంటి ఊహజనితాలకు అవకాశం లేకుండా బడ్జెట్ కూర్పు చేశారని స్వపక్ష, ప్రతిపక్ష కౌన్సిలర్లు మున్సిపల్ అధికారులను అభినందించారు. గతంలో కంటే ప్రస్తుతం ప్రవేశపెట్టిన బడ్జెట్లో కొన్ని లోపాలు తప్ప అంత సవ్యంగానే ఉందని ప్రశంసించారు. బుధవారం మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మీ అధ్యక్షతన జరిగిన బడ్జెట్ సమావేశానికి కొత్తగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, జిల్లా కలెక్టర్ దురిశెట్టి అనుదీప్లు పాల్గొన్నారు. మున్సిపల్ అకౌంటెంట్ సుజాత బడ్జెట్ను చదివి వినిపించగా అనంతరం పలు అంశాలపై ఉన్న సందేహాలను కౌన్సిలర్లు వెలిబుచ్చగా అధికారులు సమాధానమిచ్చారు.
మొత్తానికి ఈ బడ్జెట్ వాస్తవ పరిస్థితిని ప్రతిబింబిస్తుందని కొనియాడారు. అనంతరం పలువురు కౌన్సిలర్లు మాట్లాడుతూ ఇంటి పన్నులు, నల్లాబిల్లులు, ట్రేడ్ లైసెన్స్ల నుంచి వచ్చే ఆదాయమే మున్సిపాలిటీ ప్రధాన ఆదాయ వనరుగా ఉందని, ఉద్యోగులు, ఔట్సోర్సింగ్ల జీతాలకే ఇవి సరిపోతున్నాయని ఎమ్మెల్యే చొరవ తీసుకొని ప్రభుత్వంతో మాట్లాడి వీలైనన్నీ ఎక్కువ నిధులు తీసుకురావాలని కౌన్సిలర్లు కోరారు.
పలు వార్డుల్లో డ్రైనేజీలు నిర్మించాల్సిన అవసరం ఉందని, ప్రస్తుత వేసవికాలం సీజన్లో మంచినీటి సమస్య లేకుండా చూడాలని, మినీ వాటర్ స్కీంలను రిపేర్లు చేయించాలని పలువురు ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే, కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. ఆ తర్వాత ఎమ్మెల్యే మాట్లాడుతూ పట్టణాన్ని అన్నీ రంగాల్లో అభివృద్ధి చేసుకుందామని, నిధుల కోసం ప్రభుత్వంతో మాట్లాడి తీసుకువచ్చేలా కృషి చేస్తానని చెప్పారు.
ప్రస్తుత కౌన్సిల్ హయాంలోనే డివైడర్లు, రోడ్లు, డ్రైన్లు, అనిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్, తడి, పొడి చెత్త డబ్బాల పంపిణీ, డీఆర్సీసీ సెంటర్ నిర్మాణం, పట్టణ ప్రకృతి వనాలు, సెంట్రల్ లైటింగ్, స్వచ్ఛ ఆటోల ద్వారా ఇంటింటికి చెత్త సేకరణ తదితర పనులను చేశామని తెలిపారు. ఎన్ని కోట్ల నిధులైన తీసుకువస్తానని పట్టణాన్ని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తానని చెప్పారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ పి.నవీన్కుమార్, మేనేజర్ సత్యనారాయణ, ఏఈలు సాహితి, రాము, మున్సిపల్ కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.