భద్రాచలం, ఆగస్టు 29 : వార్షిక తనిఖీల్లో భాగంగా భద్రాచలం డీఎస్పీ అరుణ్ కుమార్ భద్రాచలం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ను సందర్శించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న అధికారులు, సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం పోలీస్ స్టేషన్లోని రికార్డులు, ప్రభుత్వ కిట్ ఆర్టికల్స్ను పరిశీలించి సిబ్బంది విధుల నిర్వహణపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించి పోలీస్ స్టేషన్ ఆవరణను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సిబ్బందికి సూచించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ ఆవరణలో అధికారులు, సిబ్బందితో కలిసి మొక్కలు నాటారు. భద్రాచలం పట్టణంలో ట్రాఫిక్ను క్రమబద్ధీకరించేందుకు నిరంతరం చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రధాన కూడళ్లు, రద్దీ ప్రాంతాలు, బస్టాండ్, దేవాలయాల పరిసరాలు తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్ పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ప్రజలకు, వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై ప్రత్యేక నిఘా ఉంచి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను నిరంతరం నిర్వహించాలని సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. అతివేగం, ట్రిపుల్ రైడింగ్, హెల్మెట్ లేకుండా ప్రయాణించడం, సీట్ బెల్ట్ ధరించకపోవడం, సెల్ఫోన్ మాట్లాడుతూ వాహనం నడపడం వంటి ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు.రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రమాదకర ప్రాంతాలను గుర్తించి అవసరమైన చర్యలు చేపట్టాలని, వాహనదారులకు ట్రాఫిక్ నిబంధనలపై విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు. పోలీస్ స్టేషన్లో నమోదవుతున్న కేసుల వివరాలను సీసీటీఎన్ఎస్ 2.0లో ఎప్పటికప్పుడు సక్రమంగా అప్డేట్ చేయాలని సూచించారు. బ్లూకోల్ట్స్ వాహనాలతో నిరంతరం పెట్రోలింగ్ నిర్వహిస్తూ, ప్రధాన కూడళ్లు, రద్దీ ప్రాంతాల్లో ట్రాఫిక్ అంతరాయాలను ఎప్పటికప్పుడు గుర్తించి వెంటనే నియంత్రించాలని సూచించారు. అనంతరం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న అధికారులు, సిబ్బంది సమస్యలను అడిగి తెలుసుకొని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఎస్ హెచ్ ఓ తిరుపతి, ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

భద్రాచలం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ను వార్షిక తనిఖీ చేసిన డీఎస్పీ అరుణ్ కుమార్