ఖమ్మం, జనవరి 25 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఉపాధి పథకంలో ప్రభుత్వం పలు మార్పులకు శ్రీకారం చుట్టింది. పథకం ద్వారా జిల్లాలో లక్షలాది మంది జాబ్కార్డులు పొంది ఉపాధి పొందుతున్నారు. పనుల కేటాయింపు, కూలి చెల్లింపులో అవకతవకలకు తావు లేకుండా చేసేందుకు సర్కార్ జాబ్కార్డుకు ఆధార్ అనుసంధానం చేయాలని నిర్ణయించింది. ల్లావ్యాప్తంగా మొత్తం 3,36,958 మంది కూలీలకు జాబ్కార్డులు ఉండగా, వీరిలో ఇప్పటికే 3,32,248 మంది కార్డులకు ఆధార్ అనుసంధానం పూర్తయింది. అంటే సుమారు 90 శాతం అనుసంధానం పూర్తయినట్లే. మరో 3,572 జాబ్ కార్డుల అనుసంధానం పూర్తికావాల్సి ఉన్నది. ఇప్పటివరకు మొత్తం 2,88,804 కార్డుల లింక్ సక్సెస్ అయినట్లు అధికారులకు అధికారికంగా సమాచారం వచ్చింది. మరో 36,012 మంది జాబ్కార్డులు సాంకేతిక కారణాల కారణంగా సక్సెస్ కాలేదు. అధికారులు వాటిని కొద్దిరోజుల్లోనే పరిష్కరించి ప్రక్రియను పూర్తి చేయనున్నారు.
ఉపాధి పనుల కోసం దరఖాస్తు చేసుకున్న వారందరికీ ప్రమాణాల ప్రకారం ప్రభుత్వం జాబ్కార్డులు మంజూరు చేసింది. దరఖాస్తులను సమర్పించే క్రమంలో దొర్లిన చిన్న చిన్న తప్పుల కారణంగా ప్రస్తుతం ఆ కార్డులు ఆధార్తో లింక్ కావడం లేదు. ప్రధాన సమస్యల్లో జాబ్ కార్డుల్లో ఉన్న పేరు ఆధార్ కార్డులో సరిపోలకపోవడం ఒకటి. అలాగే జాబ్కార్డుల్లో భార్యాభర్తల పేరుతో ఒకే నెంబర్ ఉండడం మరో కారణం. వీటన్నింటినీ మండల స్థాయిలో పీవోలు డీఆర్డీవో లాగిన్ ద్వారా వాటిని సవరిస్తున్నారు.
ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం నూరు శాతం జాబ్ కార్డులను ఆధార్తో అనుసంధానం చేస్తాం. ఉపాధి కూలీల జాబ్ కార్డులు ఆధార్తో అనుసంధానమైతే కూలి చెల్లింపుల్లో పారదర్శకత వస్తుంది. ఒకరి కూలి మరొకరి ఖాతాలో జమ కాదు. జాబ్కార్డులు ఉన్న వారు వెంటనే స్పందించి తమ కార్డులను ఆధార్తో అనుసంధానం చేసుకోవాలి. – విద్యాచందన, డీఆర్డీవో, ఖమ్మం