కొత్తగూడెం, అక్టోబర్ 12 : హాబీలు అందరికీ ఉంటాయి. అవి వారి వ్యక్తిగతం. కానీ కొందరి హాబీలు మాత్రం సమాజహితం. ఇతడి హాబీ కూడా ఇలాంటిదే. సమాజానికి ఎప్పటికీ ఎంతగానో ఉపయోగపడేది. అంతకుమించి ఇంకా ఉంది. తన ఆదాయంలో పది శాతాన్ని సమాజహితం కోసం కేటాయించడం, శుభకార్యాలకు వెళ్లినప్పుడు మొక్కలను బహుమతిగా ఇవ్వడం, ఎవరైనా మరణిస్తే వారి జ్ఞాపకార్థంగా వైకుంఠధామాలు, కబరస్తానల్లో మొక్కలు నాటడం, గింజలను మట్టి ముద్దలుగా చేసి అడవుల్లో విసరడం, గ్రామ పరిరక్షణ కోసం సంఘాన్ని ఏర్పాటు చేయడం, వీటన్నింటికోసం తానే కదిలివెళ్లడం వంటివి మరెన్నో. ఈ తపన, అలవాటు వంటివి ఈనాటివి కాదు.. 15 ఏళ్లుగా కొనసాగుతున్నవే. వీటికి కర్త, కర్మ, క్రియ.. ముస్తాఫా. ఎవరైనా తమ ఆదాయంలో కొంత భాగాన్ని తమ పిల్లల వివాహాల కోసమో, భవిష్యత్ అవసరాల కోసమో వెచ్చిస్తారు. కానీ కొత్తగూడెంలోని రామవరానికి చెందిన ముస్తాఫా మాత్రం అలా కాదు. తన ఆదాయంలో పది శాతాన్ని మొక్కలు నాటేందుకు, వాటిని పరిరక్షించేందుకు వెచ్చిస్తారు. మొక్కలంటే ఆయనకు ప్రాణం. అందుకో వాటి కోసం 15 ఏళ్లుగా కొంత మొత్తాన్ని కేటాయిస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన హరితహారం కూడా ముస్తాఫాకు మరింత స్ఫూర్తినిచ్చింది. దీంతో ఏటా హరితహారంలో రెండు వేల మొక్కలు నాటడం, వాటిని సంరక్షించడం ఆయన సంకల్పమైంది.
రామవరం పరిరక్షణ..
విరివిగా మొక్కలు నాటడంతోపాటు రామవరం అభివృద్ధికీ నడుంబిగించారు ముస్తాఫా. ఇందుకోసం రామవరం పరిరక్షణ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. అందులోని సభ్యులకు మొక్కలు నాటడం అలవాటు చేశారు. అంతటితోనే ఆగిపోకుండా నాటిన మొక్కలకు నీళ్లుపోయడాన్ని, వాటిని సంరక్షిండాన్ని కొనసాగిస్తున్నారు. ప్రభుత్వ భూములు, వాగులు, వైకుంఠధామాలు, కబరస్తాన్లలో వీరు నాటిన ఎన్నో మొక్కలు పెరిగి పెద్దవుతున్నాయి.
అడవుల్లో విత్తనాల బంతులు విసురుతూ..
మొక్కలకు మూలమైన గింజలను సేకరించడం.. వాటిని మట్టి ముద్దలుగా, విత్తన బంతులుగా చేసి అడవుల్లో విసరడం ముస్తాఫా దినచర్యలో భాగమయ్యాయి. రామవరంలో పరిచయమైన మొక్కల వెంకటయ్య వద్దకు వెళ్లి ఎన్నో మొక్కలు తెచ్చి మొక్కలు నాటుతున్నాడు ముస్తాఫా. శ్మశాన వాటికల్లో సమాధులు, స్తూపాలు కట్టడం కంటే మొక్కలు నాటడమే మేలంటాడాయన. మృతిచెందిన వారి జ్ఞాపకార్థంగా ఆ మొక్కలు పెరుగుతూ ఉంటాయంటాడు. ఆయన నాటిన ఎన్నో మొక్కలు అక్కడ పెరుగుతున్నాయి కూడా.
వందకు పది రూపాయలు..
మొక్కలు నాటాలన్నా, వాటిని సంరక్షించాలన్నా కొంచెం ఖర్చుతో కూడుకున్న వ్యవహారమే. అందుకే తాను చేసే టెంట్హౌస్ వ్యాపారంలో ప్రతి వంద రూపాయల్లో ఓ పది రూపాయలను మొక్కల కోసం కేటాయిస్తున్నాడు. మొక్కలను తన సొంత ఆటోలో తీసుకొని వెళ్తూ నాటుతుంటాడు.
హరితనిధి ఏర్పాటు గొప్ప విషయం..
మొక్కలు నాటడం కోసం, వాటిని సంరక్షించడానికి సీఎం కేసీఆర్ హరితనిధిని ఏర్పాటు చేయడం గొప్ప విషయం. ఇందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలి. అందరూ మొక్కలు నాటి వాటిని సంరక్షిస్తే భావితరాలకు స్వచ్ఛమైన ప్రాణవాయువు అందుతుంది. మొక్కల వెంకటయ్య సారు మాకు ఆదర్శంగా ఉన్నారు. వారి నేతృత్వంలో మా బృందం మొక్కలు నాటుతోంది. మా బృందంలో 65 మంది సభ్యులం ఉన్నాం. పర్యావరణం కోసం మేమంతా కలిసి పనిచేస్తాం. -ముస్తాఫా, రామవరం