ఎందుకూ పనికి రాదనుకునే ‘చెత్త’ ఇప్పుడు పంచాయతీల్లో సంపద సృష్టిస్తున్నది. నాడు చెత్తాచెదారం గ్రామాలను అధ్వానంగా మార్చినా.. నేడు అదనపు ఆదాయాన్ని తెచ్చిపెడుతున్నది. ‘పల్లె ప్రగతి’ స్ఫూర్తితో కంపోస్టు తయారీకి అడుగులు పడగా, జీపీలు ప్రత్యేక దృష్టి సారిస్తూ ఉత్పత్తిలో పోటీ పడుతున్నాయి. హరితహారం నర్సరీ, మొక్కలకు బయటి నుంచి కొనకుండా ఇవే ఎరువులు ఉపయోగిస్తున్నాయి. మిగిలిన దానిని స్థానిక రైతులకు విక్రయిస్తూ అదనపు ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నాయి. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ ఆదర్శంగా నిలుస్తుండగా, పలు పంచాయతీలు అదే బాటలో నడుస్తున్నాయి.
‘పల్లె ప్రగతి’తో గ్రామాల్లో మార్పు మొదలైంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి పంచాయతీకో ట్రాక్టర్ను ఇవ్వడం, డంప్యార్డు, సెగ్రిగేషన్ షెడ్లను ఏర్పాటు చేయడంతో పల్లెలు శుభ్రంగా మారడంతోపాటు కంపోస్టు ఎరువుల తయారీకి అడుగు పడింది. దీంతో ఆదాయం సమకూరుతుండగా, ఎరువుల తయారీలో జీపీలు పోటీ పడుతున్నాయి. ఇప్పటికే చాలా గ్రామాలు ఉత్పత్తి చేస్తున్నాయి. ఈ కంపోస్టును హరిత హారం నర్సరీలు, మొక్కలకే ఉపయోగించడంతోపాటు మిగిలిన ఎరువును ప్యాక్ చేసి విక్రయిస్తున్నాయి. మరోవైపు ప్లాస్టిక్ వ్యర్థాలను కూడా విక్రయిస్తూ ఆదాయం పొందుతున్నాయి.
కరీంనగర్, మార్చి 4 (నమస్తే తెలంగాణ) : స్వరాష్ట్రంలో గ్రామాల స్వరూపం పూర్తిగా మారుతున్నది. తడి చెత్త నుంచి ఎరువుల తయారీతో పంచాయతీలకు అదనపు ఆదాయం సమకూరుతున్నది. ‘పల్లె ప్రగతి’లో భాగంగా గ్రామానికో డంప్ యార్డ్, సెగ్రిగ్రేషన్ షెడ్డును నిర్మించారు. తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించేందుకు ఇంటింటికీ ట్విన్ చెత్త బుట్టలు అందించారు. ప్రతి రోజు ఇంటింటికీ తిరిగి చెత్త సేకరించేందుకు ప్రతి పంచాయతీకి ఒక ట్రాక్టర్ను ఇచ్చారు. ప్రతి గ్రామంలోనూ చెత్తను సేకరించి డంప్ యార్డుకు తరలిస్తున్నారు. ఇక్కడ తడి, పొడి చెత్తను వేరుచేసి తడి చెత్తతో కంపోస్టు ఎరువులను ఉత్పత్తి చేస్తున్నారు. ఉత్పత్తి చేసిన కంపోస్టును హరితహారం నర్సరీలు, మొక్కలకు ఉపయోగిస్తున్నారు. మొదట్లో నర్సరీలు, మొక్కల కోసం అవసరమైన కంపోస్టును గ్రామ పంచాయతీలు కొనుగోలు చేయాల్సి వచ్చినా.. ప్రస్తుతం స్థానికంగా తయారు చేసిన ఎరువును వాడుతున్నారు. మిగిలిన ఎరువును స్థానిక రైతులకు తక్కువ ధరలో విక్రయిస్తున్నారు. కొన్ని గ్రామాల్లో సీజన్కు ముందే కొని, భద్రపర్చుకుంటున్నారు. మామూలుగా అయితే కిలో 10 చొప్పున, అదే ప్యాకింగ్ చేస్తే 15 నుంచి 20 వరకు ధర నిర్ణయించి విక్రయిస్తున్నారు.
ఆదర్శం తిమ్మాపూర్
పల్లె ప్రగతి స్ఫూర్తితో మండల కేంద్రమైన తిమ్మాపూర్ పంచాయతీ హరితహారం, పారిశుధ్యం వంటి కార్యక్రమాల్లోనే కాకుండా కంపోస్ట్ ఎరువుల తయారీలోనూ ఆదర్శంగా నిలుస్తున్నది. రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా ఈ గ్రామంలోని జీపీ కార్యాలయంలో కంపోస్ట్ ఎరువు విక్రయానికి ప్రత్యేకంగా స్టాల్ ఏర్పాటు చేశారు. సర్పంచ్ దుండ్ర నీలమ్మ రాజయ్య, పంచాయతీ కార్యదర్శి కే మహేందర్ రావు ప్రత్యేక శ్రద్ధతో కంపోస్టు ఎరువులను ఉత్పత్తి చేయిస్తున్నారు. ప్రతి రోజూ 1.50 నుంచి 2 క్వింటాళ్ల తడి చెత్తను సేకరిస్తున్న ఈ జీపీలో ఇప్పటివరకు 6,296 కిలోల కంపోస్ట్ ఎరువులను ఉత్పత్తి చేశారు. అందులో హరితహారం నర్సరీలు, మొక్కలకు 3,972 కిలోలు వినియోగించగా, మిగిలిన 2,218 కిలోలు విక్రయించారు. దీని ద్వారా 22,181 ఆదాయం వచ్చినటు కార్యదర్శి తెలిపారు. ముఖ్యంగా వాడి వదిలేసిన వాటర్ బాటిళ్లలో ఈ ఎరువులు నింపి, వాటికి పంచాయతీ లేబుల్స్ వేసి 10లకు ఒకటి చొప్పున విక్రయిస్తున్నారు. కిలో, రెండు కిలోల బ్యాగులు ప్రత్యేకంగా తయారు చేయించి వాటిలోనూ ప్యాక్ చేసి అమ్ముతున్నారు. రైతుల కోసం 10, 20 కిలోల బస్తాలు తయారు చేయించారు. కరీంనగర్, హైదరాబాద్, నాగపూర్ నుంచి వచ్చిన వాళ్లు కూడా కొనుగోలు చేసుకుని వెళ్తున్నారు. ఇప్పటికే 11 సార్లలో ఆరువేల కిలోలకుపైగా ఉత్పత్తి చేసిన తిమ్మాపూర్ పంచాయతీ జిల్లాలోనే ప్రథమ స్థానంలో ఉండగా, జమ్మికుంట మండలం విలాసాగర్ 5 వేల కిలోలు ఉత్పత్తి చేసి రెండో స్థానంలో కొనసాగుతున్నది. ఇటు పొడి చెత్తలో సేకరించిన వ్యర్థాలతో కూడా తిమ్మాపూర్ ఆదాయం సమకూర్చుకుంటున్నది. ఇప్పటి వరకు 1,019 కిలోల వ్యర్థాలను విక్రయించగా, 13,450 ఆదాయం వచ్చింది.
కరీంనగర్ జిల్లాలో 6.50లక్షలకుపైగా
ఎరువుల ఉత్పత్తి ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్నది. రానున్న కాలంలో ఉత్పత్తి మరింత పెరిగే అవకాశమున్నది. కరీంనగర్ జిల్లాలోని 313 పంచాయతీల పరిధిలో ఇప్పటివరకు 2,38,240 కిలోల ఎరువులు ఉత్పత్తి చేయగా, 2,25,581 కిలోలు హరితహారం నర్సరీలు, మొక్కలకు వినియోగించారు. మిగిలిన 12,659 కిలోలు రైతులతోపాటు అవసరమైన గ్రామస్తులకు విక్రయించారు. దీని ద్వారా 1,23,945 అదనపు ఆదాయం సమకూరింది. అలాగే పొడి చెత్త నుంచి సేకరించిన 43,372 కిలోల వ్యర్థ్ధాలతో 3,42,930 అదనపు ఆదాయం వచ్చింది.
అదనపు ఆదాయం వస్తోంది..
కంపోస్టు ఎరువుల ఉత్పత్తి ద్వారా పంచాయతీకి అదనపు ఆదాయం వస్తున్నది. హరిత హారం, పారిశుధ్యమే కాకుండా కంపోస్ట్ ఎరువుల తయారీలో కూడా మా పంచాయతీ ముందు వరసలో ఉన్నది. కంపోస్టును ప్రత్యేకంగా ప్యాకింగ్ చేయడంతో ఆకర్షణీయంగా మారుతున్నది. మా పంచాయతీ పరిధిలో ప్రతి రోజు సుమారు 2 క్వింటాళ్ల తడి చెత్త సేకరిస్తున్నం. దీనిని సెగ్రిగేషన్ షెడ్డులో వేస్తం. 45 నుంచి 60 రోజుల్లో కంపోస్టు ఎరువుగా మారుతుంది. ఇప్పటికీ 11 సార్లు తీశాం. 6వేల కిలోలకు పైగా ఉత్పత్తయింది. మా అవసరాలకు వాడుకోగా మిగిలింది విక్రయిస్తున్నం.
– కే మహేందర్ రావు, పంచాయతీ కార్యదర్శి (తిమ్మాపూర్)
మా ఊరి ఎరువుకు మంచి గుర్తింపు
మా ఊరిలో తయారు చేస్తున్న వర్మి కంపోస్టు ఎరువుకు మంచి గుర్తింపు వచ్చింది. చాలా మంది అడుగుతున్నరు. అందుకనే పంచాయతీ ఆఫీసుల్నే ఒక స్టాల్ పెట్టినం. అవసరమైనోళ్లు వచ్చి కొనుక్కపోతున్నరు. ప్రతి వ్యక్తికి రసీదు కట్ చేసి ఇస్తున్నం. జిల్లాలోనే ఎక్కువ మొత్తంల మా ఊళ్లెనే ఉత్పత్తి అయితంది. అందుకు చానా సంతోషం. మా కార్యదర్శి మహేందర్ రావు, సిబ్బంది కృషి, మా పాలకవర్గ సభ్యుల ప్రోత్సాహం అందుకు కారణం. మా ఎంపీపీ వనిత కూడా మా పంచాయతీని మంచిగ చూసుకుంటరు.
– దుండ్ర నీలమ్మ రాజయ్య, సర్పంచ్ (తిమ్మాపూర్)