కరీంనగర్ రాంనగర్, ఏప్రిల్ 9: పీడీఎస్ రైస్ దందా బట్టబయలైంది. సివిల్ సప్లయి గోదాం నుంచి రైస్ మిల్లుకు తరలిస్తున్నట్లు అధికారుల దాడుల్లో బహిర్గతమైంది. వివరాల ప్రకారం.. పక్కా సమాచారం మేరకు టాస్క్ఫోర్స్, స్పెషల్ బ్రాంచ్ పోలీసులు మంగళవారం తెల్లవారుజామున 3గంటల ప్రాంతంలో కరీంనగర్ రూరల్ మండలం దుర్శేడ్లోని వెంకటేశ్వర రైస్మిల్లులో దాడులు చేశారు. ఓ ట్రాలీ వాహనంలో తీసుకొచ్చిన సుమారు 810 బస్తాల పీడీఎస్ బియ్యం బస్తాలను రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఈ బియ్యం బస్తాలను సివిల్ సప్లయి గోదాం నుంచి మిల్లుకు తీసుకొచ్చినట్టు గుర్తించారు.
గోపాల్పూర్కు చెందిన రేషన్ డీలర్ బెజ్జంకి అంజయ్య.. రైస్మిల్ యజమాని సంతోష్రెడ్డితో కుమ్మక్కై పీడీఎస్ రైస్ను తక్కువ ధరకు కొని రైస్మిల్లుకు తరలిస్తున్నట్లు నిర్ధారించారు. గోపాల్పూర్కు చెందిన ఊరడి మధు వాహనంలో ఈ బియ్యా న్ని తరలించినట్లు గుర్తించి, 810 బస్తాలతోపాటు వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంలో రేషన్ డీలర్ అంజయ్య, రైస్మిల్ యజమాని సంతోష్రెడ్డి, ట్రాలీ వాహన డ్రైవర్ మధుపై కేసు నమోదు చేశామని, విచారణ జరుపుతున్నామని రూరల్ సీఐ ప్రదీప్ తెలిపారు.