స్వయం సహాయక సంఘాలకు రాష్ట్ర సర్కారు మరింత చేయూతనిచ్చేందుకు నిర్ణయించింది. ఇప్పటివరకు పరిమితంగా మాత్రమే రుణాలివ్వగా, ఇకనుంచి అడిగినంత రుణం వడ్డీ లేకుండా ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఈ నెల నుంచే అవసరమైన మేరకు అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నది. ఇప్పటికే వివిధ పథకాల కింద అందించిన రుణాలను మహిళలు సకాలంలో చెల్లిస్తుండగా, అదనంగా అడిగినమేరకు రుణమిచ్చేందుకు జిల్లాల్లోని సెర్ప్, మెప్మా సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో, జిల్లాలోని గ్రామీణ, పట్టణ పేదరిక నిర్మూలన సంస్థలు సంఘాలకు సాయం చేసేందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందిస్తున్నాయి.
కరీంనగర్ కలెక్టరేట్, ఏప్రిల్ 19 : లోన్ యాప్ల ద్వారా అప్పులు తీసుకున్న అనేక మంది ఆయా సంస్థలు విధించే చక్రవడ్డీలు, బారు వడ్డీలు చెల్లించలేక ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు అనేకం ఉన్నాయి. వీటిని నిర్మూలిస్తూ, ప్రై‘వేటు’ సంస్థల బారి నుంచి కాపాడేందుకు స్వయం సహాయక సంఘాల్లోని సభ్యులకు అడిగినంత మేరకు రుణాలిచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం సెర్ప్, మెప్మా సంస్థల నిబంధనల్లో మార్పులు చేస్తూ, రుణ సరళీకృత విధానం అమలులోకి తెచ్చింది. గతంలో ఒకసారి సాధారణ రుణం తీసుకుంటే తిరిగి చెల్లించేవరకు మరోసారి రుణం లభించేది కాదు.
వ్యాపార సంబంధ రుణం మాత్రమే తీసుకునే అవకాశముండేది. ఈ రుణం తీసుకునేందుకు నిబంధనలు కఠినంగా ఉండటంతో సంఘాల్లోని సభ్యులు కూడా అంతగా ఆసక్తి కనబర్చలేదు. ప్రైవేటు రుణ సంస్థల వైపు మొగ్గు చూపారు. జిల్లాలో గత ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించిన లక్ష్యంలో 70 శాతం మాత్రమే సెర్ప్, మెప్మా సంస్థలు చేరుకున్నాయి. దీనిని గమనించిన రాష్ట్ర ప్రభుత్వం నిబంధనలు సడలించి, అడిగిన మేరకు రుణాలు పంపిణీ చేయాలని బ్యాంకర్లను ఆదేశించింది. అలాగే, మహిళా సంఘాల్లోని సభ్యుల కుటుంబ సభ్యులకు వ్యాపారాల కోసం రుణాలివ్వొచ్చంటూ సర్క్యులర్ జారీ చేసింది. ప్రస్తుతం ప్రభుత్వం తీసుకున్న సరళీకృత విధానంతో గతంలో తీసుకున్న రుణం నాలుగు నెలల పాటు చెల్లించిన తర్వాత మరోసారి కూడా సాధారణ రుణం ఇచ్చే అవకాశముంటుంది.
దీంతో, ఈసారి రుణాలు పొందేందుకు సంఘాల నుంచి పెద్ద మొత్తంలో దరఖాస్తులు వస్తాయని సంబంధిత అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కరీంనగర్ జిల్లాలోని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థలో 14,584, పట్టణ పేదరిక నిర్మూలన సంస్థలో 7,522 సంఘాలు ఉన్నాయి. ఈ సంస్థల్లో 2,38,708 మంది సభ్యులు ఉండగా, 1,00,634 మంది మాత్రమే రుణాలు తీసుకున్నారు. గత ఆర్థిక సంవత్సరంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న సంఘాలకు రూ.158 కోట్ల రుణాలివ్వాలని లక్ష్యంగా నిర్ధేశించగా, లక్ష్య సాధనకు బ్యాంకర్ల నిబంధనలు అడ్డంకిగా మారాయి. సాధారణ రుణం రూ.లక్ష వరకు, వ్యాపార రుణం రూ.మూడు లక్షల నుంచి రూ.ఆరు లక్షల వరకు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం లిఖిత పూర్వక ఆదేశాలు జారీచేయటంతో, మహిళా సంఘాల కుటుంబ సభ్యులు కూడా రుణాలు తీసుకునేందుకు ఉత్సుకత ప్రదర్శిస్తున్నారు.