మహిళా గ్రామైక్య సంఘాల సహాయకులు(వీవోఏ)గా పని చేస్తున్న మహిళలకు రాఖీ పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం కానుక అందించింది. వీరికి నెలకు ఇచ్చే వేతనాన్ని రూ.5 వేలకు పెంచుతూ గురువారం ఆదేశాలు జారీ చేసి తీపి కబురు అందింది. గ్రామైక్య సంఘాల ద్వారా వచ్చే రూ.3 వేలతో కలిపి వేతనం రూ.8 వేలకు చేరింది. దీంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 1,944 మందికి ప్రయోజనం కలుగనున్నది. కాగా ప్రభుత్వ నిర్ణయంపై గ్రామైక్య సంఘాల సహాయకుల్లో హర్షం వ్యక్తమవుతున్నది.
-కరీంనగర్, ఆగస్టు 31 (నమస్తే తెలంగాణ)
కరీంనగర్, ఆగస్టు 31 (నమస్తే తెలంగాణ) :రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న మహిళా సమైక్య సంఘాలకు సంబంధించి లెక్కలు, రుణాలు ఇప్పించేందుకు, రికార్డులు సక్రమంగా నిర్వహించేందుకు నియమించిన విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్ల (గ్రామైక్య సంఘాల సహాయకుల)కు వేతనాలు పెంచుతూ సర్కారు తీపి కబురు అందించింది. గతంలో వీరికి ప్రభుత్వం నుంచి కేవలం రూ.3 వేలు మాత్రమే వచ్చేవి. గ్రామైక్య సంఘాల ఆదాయం నుంచి మరో రూ.3 వేలు గౌరవ వేతనంగా చెల్లించేవారు. జీవో నంబర్ 63 ప్రకారం 2021 జూన్ 15న ప్రభుత్వం నుంచి వచ్చే గౌరవ వేతనాన్ని రూ.3,900కు పెంచింది. ఇప్పుడు రూ.5 వేలకు పెంచుతూ జీవో నంబర్ 442 జారీ చేసింది. అంటే రెండేళ్లలో రూ.2 వేల వేతనం పెంచింది. దీంతో ప్రతి వీఓఏకు ఇప్పుడు నెలకు రూ.5 వేలు ప్రభుత్వం ద్వారా, మరో రూ.3 వేలు గ్రామైక్య సంఘాల ద్వారా మొత్తం నెలకు రూ.8 వేలు గౌరవ వేతనంగా అందనుంది.
ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని కరీంనగర్లో 529 మంది, జగిత్యాలలో 565 గ్రామైక్య సంఘాలు ఉండగా 560 మంది, పెద్దపల్లిలో 450 మంది, సిరిసిల్లలో 411 గ్రామైక్య సంఘాలకు 405 మంది సహాయకులు ఉన్నారు. మొత్తంగా చూస్తే ఉమ్మడి జిల్లాలో 1,955 గ్రామైక్య సంఘాల్లో ప్రస్తుతం పని చేస్తున్న 1,944 మంది వీవోఏలకు ప్రయోజనం చేకూరనుంది. వీరికి ఒక్కొక్కరికి నెలకు రూ.8వేల చొప్పున వేతనాలు అందనున్నాయి. ఈ నేపథ్యంలో వీఓఏలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే రెండు సార్లు గౌరవ వేతనాన్ని పెంచిన రాష్ట్ర ప్రభుత్వం తమకు అండగా నిలబడుతోందని సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఉమ్మడి రాష్ట్రంల మమ్మల్ని ఎవరూ పట్టించుకున్న పాపానపోలేదు. కేసీఆర్ సార్ సీఎం అయినంకనే మాకు వేతనాలు ప్రారంభమైనయ్. అంతకు ముందు మహిళా సంఘం గ్రూపు నుంచి రూ.100 చొప్పున తీసుకునేటోళ్లం. గ్రూపుల పైసలుంటే తీసుకునేది లేకుంటే లేదు. నెలకు ఇంత వేతనం వస్తది అనేది లేకుండా పని చేశాం. తెలంగాణ సర్కారు వచ్చినంక రూ.3 వేలు ఇచ్చింది. మళ్లీ మరో రూ.900 పెంచి ఇప్పటి వరకు రూ.3900 ఇస్తోంది. ఇప్పుడు మరో రూ.1100 పెంచి రూ.5 వేలు చేసింది. దీంతో సర్కారు నుంచి రూ.5 వేలు, వీవోఏ సంఘం నుంచి రూ.3 వేలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ సార్ ప్రకటించిండు. గతంలో ఎవరూ గుర్తించని మమ్మల్ని కేసీఆర్ సారు గుర్తించి మాకో దారి చూపిండు.
– మెరుగు రూప, వీవోఏ, ఉప్పరమల్యాల (గంగాధర)
గ్రామీణ స్థాయిలో మహిళా సంఘాలను బలోపేతం చేస్తూ మహిళల ఆర్థిక చైతన్యానికి ఎంతగానో కృషి చేస్తున్న మమ్మల్ని సీఎం కేసీఆర్ సార్ గుర్తించి వేతనాలు పెంచడం అదృష్టంగా భావిస్తున్నాం. రెట్టింపు ఉత్సాహంతో పని చేస్తాం. మహిళా సంఘాల అభివృద్ధి కోసం మా సమయాన్నంతా కేటాయిస్తూ పనిచేస్తున్నాం. బ్యాంకుల లింకేజీ ద్వారా రుణాలు మంజూరు చేయించడం, సభ్యులతో చెల్లింపులు, సభ్యులు రుణాలను సద్వినియోగపరుచుకునేలా సూచనలు ఇవ్వడం వంటివి చేస్తున్నాం. మా పనికి తగిన వేతనాలు ఇవ్వడం ఆనందంగా ఉంది. ప్రభుత్వానికి ధన్యవాదాలు.
– ఆవుల రాధ, వీఓఏ, రామకృష్ణ కాలనీ(తిమ్మాపూర్)
2007 నుంచి మా వీఓఏ వ్యవస్థ ఉంది. కానీ, మమ్మల్ని పట్టించుకున్నోళ్లు లేరు. కానీ, ప్రత్యేక రాష్ట్రం వచ్చినంకనే మా వేతనాలు రూ.వందల నుంచి రూ.వేలల్లకు మారినయ్. ఇప్పుడు సీఎం కేసీఆర్ సారు ఒకేసారి రూ.1100లు పెంచిండు. దీంతో మాకు రూ.5 వేల వేతనం అయ్యింది. బీఆర్ఎస్ ప్రభుత్వంతోనే మాకు మంచిరోజులు వచ్చినై.
– రాసకొండ స్వప్న, వీవోఏ అక్కెపల్లి, మంథని మండలం
మా వీఏవో పోస్టు ఎన్నటికైనా సర్కార్ నౌకరి అయితదని, మంచి జీతాలు వస్తయని పనిజేస్తున్నం. కానీ, గతంల ఎవరూ మమ్మల్ని పట్టించుకోలె. 2007 నుంచి 2014 దాకా రూ.250లు ఉండేది. ఒక్కరన్న ఇదేంది అని అనలేదు. సీఎం కేసీఆర్ సారే మా కష్టాలను గుర్తించి జీతాలను పెంచిండు. మునుపు రూ.3900లు జేసిండు. ఇప్పుడు మళ్ల రూ.1100లు పెంచిండు. కొంచెం కష్టపడి గ్రామాఖ్య సంఘానికి మంచి లాభాలాలను తీసుకస్తే సెర్ప్ నుంచి మంచిగనే మిగుల్తయి. వేతనాలను పెంచిన సీఎం కేసీఆర్ సార్కు మా కృతజ్ఞతలు.
-కమటం స్వరూప, వీవోఏ, విలోచవరం, మంథని మండలం
మాకు వేతనాలు పెంచిన ప్రభుత్వానికి ధన్యవాదాలు. మా స్థాయిలో మహిళా సంఘాల సభ్యుల అభ్యున్నతికి, సంఘాల అభివృద్ధికి ఎంతగానో పాటుపడుతున్నాం. అందుకు తగ్గట్టుగా ప్రభుత్వం గౌరవించడం, ప్రకటన చేయడం సంతోషంగా ఉంది. ప్రభుత్వం నుంచి వచ్చే సూచనలు పాటిస్తున్నాం. ఏ పిలుపులకైనా తక్షణం స్పందిస్తున్నాం. ప్రభుత్వం నుంచి బ్యాంకు లింకేజీ ద్వారా మహిళా సంఘాలకు వచ్చే లబ్ధిని ప్రతి సభ్యురాలికి అందేలా కృషి చేస్తున్నాం. మమ్మల్ని గుర్తించిన సీఎం కేసీఆర్ సార్కు ధన్యవాదాలు.
– నగునూరి మంజుల, వీవోఏ సంఘం కరీంనగర్ జిల్లా అధ్యక్షురాలు(తిమ్మాపూర్)