ఎములాడను ఏలిన 12 మంది రాజులు
కవులు, కళాకారులకు పుట్టినిల్లు
వేలఏండ్ల నాటి చరిత్రగల పట్టణం
ఎములవాడ పేరు చెబితే గుర్తుకు వచ్చేది రాజన్న.. ఉత్తర తెలంగాణ పల్లెల్లో ఇంటింటి దేవుడు రాజన్న.. భక్తుల కొంగు బంగారంగా.. కోడెను కట్టేస్తే కోరిన కోర్కెలు తీర్చే పేదల దేవుడిగా విలసిల్లుతున్నది రాజన్న క్షేత్రం. వేల ఏండ్ల చరిత్ర ఉన్న ఈ వేములవాడ, దక్షిణకాశీగా భాసిల్లుతున్నది.
కరీంనగర్, మార్చి 29 : ఎములాడ రాజన్న తెలంగాణ ఇంటింటి దేవుడు. తెలంగాణలోని అనేక జిల్లాల్లో.. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ పల్లెల్లో ఇంటికొక్క రాజన్న ఉన్నారంటే రాజరాజేశ్వర స్వామి సుప్రసిద్ధత ఎంతటిదో అర్థం చేసుకోవచ్చు. అందుకే భక్తుల కొంగుబంగారంగా రాజన్న సన్నిధి మారింది. కృతయుగం నుంచి ఈ క్షేత్ర ప్రస్తావన పురాణాల్లో కనిపిస్తుంది. ప్రస్తుతం ప్రఖ్యాత శైవక్షేత్రంగా వర్ధిల్లుతున్న వేములవాడ ఒకప్పుడు రాజకీయంగానూ ఓ వెలుగు వెలిగింది. వేములవాడ చాళుక్యుల కాలం నుంచి మాత్రమే చారిత్రక ఆధారాలు లభ్యమవుతున్నాయి. సుమారు 12 మంది రాజులు ఈ రాజ్యాన్ని పరిపాలించారు.
కరీంనగర్ జిల్లాలో 1970-1980 మధ్య కాలంలో పురావస్తు శాఖ జరిపిన తవ్వకాల్లో కోటిలింగాల, ధూళికట్ట లాంటి చోట్ల శాతవాహనుల కాలం నాటి కోటలు, ఇతర కట్టడాలు బయటపడ్డాయి. ఆ లెక్కన క్రీ.పూ.3వ శతాబ్దం నుంచి క్రీ.శ.3వ శతాబ్దం మధ్య కాలంలో వేములవాడలో శాతవాహనుల పరిపాలన తప్పక కొనసాగి ఉంటుందని భావిస్తున్నారు. కానీ, మొదట బోధన్ రాజధానిగా సపాదలక్షను ఏలిన వేములవాడ చాళుక్యులు (రాష్ట్రకూటుల సామంతులు) ఆ తర్వాత వేములవాడ రాజధానిగా పరిపాలించినట్టు శాసనాల ఆధారంగా తెలుస్తున్నది. వినయాదిత్య యుద్ధమల్లుడు. క్రీ.శ. 750లో చాళుక్య సామంత రాజ్య సింహాసనాన్ని బోధన్లో అధిష్ఠించాడు. అతడి మరణానంతరం పెద్దకొడుకు మొదటి అరికేసరి 775లో అధికారంలోకి వచ్చాడు. మొదటి అరికేసరి, అతడి విజయాల గురించి, పంప కవి ‘విక్రమార్జున విజయం’, రెండో అరికేసరి వేములవాడ శాసనాల ద్వారా తెలుస్తున్నది. ఈయన కాలంలోనే బోధన్ నుంచి రాజధానిని వేములవాడకు మార్చారు. క్రీ.శ. 973లో మూడో అరికేసరి పాలనతో వేములవాడ చాళుక్య పాలన అంతరించినట్లు చెప్పుకోవచ్చు.
కాకతీయులు..కుతుబ్షాహీలు..
వేములవాడ చాళుక్యుల తర్వాత ఈ ప్రాంతం కాకతీయుల ఆధీనంలోకి వచ్చింది. క్రీ.శ. 1110 లో రెండో పోలరాజు స్వతంత్ర రాజయ్యాడు. 1323లో ప్రతాపరుద్రుడు ఢిల్లీ సుల్తానుకు బంధీగా పట్టుబడే వరకూ వేములవాడ కాకతీయుల ఆధీనంలోనే ఉంది. 1512లో గోల్కొండ నవాబుగా స్వతంత్రుడైన కులీ కుతుబ్ షా పాలన కిందకు వేములవాడ వచ్చింది. 1688లో గోల్కొండ పతనమైన తర్వాత సుబేదార్ల సాయం తో ఔరంగజేబు పరిపాలన కొనసాగింది. 1724 లో నిజాం ఉల్ముల్క్ అసఫ్జాహీల పేరిట స్వతం త్ర హైదరాబాద్ రాజ్యాన్ని స్థాపించడంతో నాటి నుంచి 1948లో పోలీస్ చర్య జరిగే దాకా ఈ వేములవాడ క్షేత్రం నిజాం నవాబుల పాలనలోనే ఉంది. క్రీ.శ.1882లో అప్పటి నిజాం నవాబు మీర్ మహబూబ్ అలీ ఖాన్ వేములవాడ రాజేశ్వరక్షేత్రాన్ని స్థానిక బ్రాహ్మణులందరికీ ఉమ్మడి అగ్రహారంగా దానమిచ్చాడు. అగ్రహారంపై అన్ని రకాల పన్నులను మాఫీచేస్తున్నట్లు అధికార శాసనం వేయించాడు. 1911 లో ముఖ్యమైన మార్పులతో నిజాం నవాబు మరో ఫర్మానా జారీ చేశాడు. క్రీ.శ. 1926లో ఐదుగురు బ్రాహ్మణులను అధికారులుగా నియమిస్తూ స్థానిక 128 బ్రాహ్మణ కుటుంబాల పేరున ఈ వేములవాడ అగ్రహారం విరాసత్ (సొంతం) చేయించాడు. 1939 జూన్ 12న గ్రీక్స న్ ఆర్థిక మంత్రిగా ఉన్న కాలంలో వేములవాడ అగ్రహారాన్ని ‘అత్యాషాహీ’గా (అంటే ‘రాజుతో దానమీయబడింది’గా) నిర్ణయించారు. తర్వాత అగ్రహారం పర్యవేక్షణ హక్కును జిల్లా అధికారికి అప్పగించారు. 1951లో దేవాలయ నిర్వహణను దేవాదాయ, ధర్మాదాయ శాఖకు అప్పగించారు.