Duddilla Sridhar Babu | మంథని, ఏప్రిల్ 13 : ఇరాన్, ఇజ్రాయిల్ దేశాల్లో జరుగుతున్న యుద్ధ ప్రభావంతో రాష్ట్రంలోని ప్రజలకు గ్యాస్ ఇబ్బందులు తలెత్తకుండా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్రెడ్డి, తాము, సహచర మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డిలం కోరినట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు వెల్లడించారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన కౌన్సిల్ సమావేశంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు పాల్గొని కౌన్సిల్ సభ్యులతో పట్టణ అభివృద్ధిపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్బాబు మాట్లాడుతూ.. ప్రజల అభిప్రాయం మేరకు రాజకీయాలకు అతీతంగా మంథని పట్టణాన్ని ఆదర్శణీయంగా తీర్చిదిద్దుతామ న్నారు. ఇప్పటికే మంథని పట్టణంలో కోట్లాది రూపాయల నిధులతో సీసీ రోడ్లు, అండర్ డ్రైనేజీల నిర్మాణం పూర్తి చేసినట్లు తెలిపారు. ఆయా వార్డుల్లో పౌరుకుల సంబంధించి కమిటీ వేసి వారి భాగస్వామ్యంతో పట్టణంలోని అన్ని వార్డుల్లో అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. మున్సిపల్ నూతన పాలకవర్గం ప్రజల అభిప్రాయం మేరకు అభివృద్ధి ప్రణాళికలు సిద్ధం చేసి అభివృద్ధికి, సంక్షేమానికి అవరోధం కాకుండా ముందుకు సాగాలన్నారు. వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని యాక్షన్ ప్లాన్ తయారు చేసి పట్టణంలో ఎక్కడ కూడ నీటి ఎద్దడి లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలో గ్యాస్ నిలువలు సరిపడా ఉన్నప్పటికీ యుద్ధం ఇదే విధంగా కొనసాగితే గ్యాస్, డిజీల్, పెట్రోల్ వంటి వాటికి రాష్ట్రంలో ఇబ్బందులు తలెత్తే ప్రమాదమున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలన్నారు. దీనిపై ఇప్పటికే సీఎం రేవంత్రెడ్డి, సహచర మంత్రులతో సమీక్ష సమావేశాలు నిర్వహించి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగిందన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రజలకు గ్యాస్, డిజీల్, పెట్రోల్ ఇబ్బందులు తలెత్తకుండా తగు చర్యలు తీసుకోవాలన్నారు. 6వార్డుతో పాటు పలువురు కౌన్సిలర్లు తమ వార్డుల్లో నేలకొన్న పలు సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని మంత్రికి వినతి పత్రాలను అందించారు. అంతకు ముందు పోచమ్మవాడలో పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకున్న పెరుగు సతీష్ కుటుంబ సభ్యులను మంత్రి శ్రీధర్బాబు పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నొడ్నాల శ్రీనివాస్, కమీషనర్ మనోహర్, వైస్ చైర్మన్ సహేందర్రెడ్డి, కౌన్సిలర్లు కుర లింగయ్య, మాచీడి రాజుగౌడ్, మద్దికట్ల స్రవంతి, పోతరవేన శ్రీలత, మారుపాక నిహారిక, వేముల లక్ష్మి, ఇల్లందుల వంశీధర్, కాంగ్రెస్ నాయకులు కొత్త శ్రీనివాస్, శశిభూషన్కాచేలతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.