కరీంనగర్ ముకరంపుర, ఫిబ్రవరి 17 : రైల్వే శాఖ ఆధ్వర్యంలో ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్ సీటీసీ) తీర్థయాత్రలకు వెళ్లే వారి కోసం ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకు వచ్చిందని ఐఆర్ సీటీసీ అసిస్టెంట్ మేనేజర్ పీవీ వెంకటేష్ తెలిపారు. కరీంనగర్ రైల్వే స్టేషన్లో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో తీర్థయాత్రల ప్రత్యేక ప్యాకేజీలు, రైళ్ల వివరాలు, అందిస్తున్న సేవల గురించి వివరించారు. హైదరాబాద్ నుంచి మార్చి 21 నుంచి మే 21 వరకు భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు ద్వారా తీర్థయాత్రల ప్రయాణాలను అందుబాటులోకి తీసుకు వస్తున్నట్లు చెప్పారు.
ప్యాకేజీల ద్వారా తీర్థయాత్రలు వెళ్లే యాత్రికుల కోసం బస్సు, హోటల్, అల్పాహారం, భోజనం, తాగునీరు, ఎసార్ట్ అందుబాటులో ఉంటాయని చెప్పారు. సందర్శించే దేవాలయాల వరకు ఉచిత ప్రయాణ సౌకర్యం ఉంటుందని తెలిపారు. ప్రతి రైలులో 705 మంది ప్రయాణికులు, ప్రతి 70 మందికి ఇద్దరు కోఆర్డినేటర్లు అందుబాటులో ఉండి అన్ని వసతి, సౌకర్యాలు కల్పిస్తారని వివరించారు. ప్రతి కోచ్కు సెక్యూరిటీ గార్డ్, సీసీ కెమెరాలతో కూడిన భద్రత ఉంటుందని తెలిపారు. మరింత సమాచారం కోసం వెబ్ సైట్ www.irctctourism.com ను, అదేవిధంగా టికెట్ల బుకింగ్ కోసం 970 1360701, 9281030727, 9281030759 నెంబర్లను సంప్రదించవచ్చని సూచించారు.