చిగురుమామిడి, జూలై 29 : పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని తిమ్మాపూర్ ఎక్సైజ్ ఎస్ఐ భారతి, సర్పంచ్ సన్నిల్ల కవిత అన్నారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలోని గాగిరెడ్డి పల్లెలో వన మహోత్సవంలో భాగంగా చెరువు కట్టకు ఇరువైపులా ఖర్జూర, ఈత మొక్కలను బుధవారం నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం జూలై మొదటి వారంలో వారం రోజులపాటు చెట్ల పెంపక పండుగ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని, ఇటీవల వర్షాలు ఆలస్యం కావడం వల్ల బుధవారం నాటడం జరిగిందన్నారు.
పర్యావరణ పరిరక్షణను ప్రతి ఒక్కరు రక్షించుకోవాలని, అటవీ సంపద పెంపొందించుకోవాలని అన్నారు. ప్రజల్లో పర్యావరణ పై పూర్తి అవగాహన కల్పించాలన్నారు. ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సన్నీల్ల వెంకటేష్, వార్డు సభ్యులు మంద శ్రీనివాస్, అన్నవేనీ శ్రీనివాస్, వెంకటేశం పంచాయతీ కార్యదర్శి సంపత్, ఫీల్డ్ అసిస్టెంట్ శంకర్, మహిళా సమాఖ్య అధ్యక్షురాలు లత, రమ, గౌడ సంఘం సభ్యులు మధు, వెంకటేశ్వర్లు, శేఖర్, బిక్షపతి, రాజేశం సాంబయ్య తదితరులున్నారు.