Mallapur | మల్లాపూర్, ఆగష్టు 24 : స్వామియే శ్రీ సోమేశ్వర నమో నమః అనే భక్తుల శివ నామస్మరణాలతో మల్లాపూర్ మండల కేంద్రంలోని ప్రసిద్ధి గాంచిన శ్రీ కనక సోమేశ్వరస్వామి కొండ మార్మోగింది. ప్రాచీన చరిత్ర గల శ్రీ కనక సోమేశ్వరస్వామి ఆలయం సుమారు పదహారు వందల అడుగుల ఎత్తైన ఏక శిల కొండపై శ్రీ కనకసోమేశ్వరస్వామి ఆలయం కొలువుదీరిన సంగతి తెలిసిందే. ఇక్కడ ప్రతీ ఏటా శ్రావణమాసంలో ఐదు సోమవారాల పాటు భక్తులు కాలినడకన కొండపైకి ఎక్కి కొండపై గల సహజసిద్ధమైన కోనేరులో పుణ్యస్నానాలు ఆచరించి ఎంతో భక్తి శ్రద్ధలతో సోమేశ్వరస్వామికి ప్రీతిపాత్రమైన వరదపాశం (బెల్లం అన్నం)ను వండి ఆలయం ఎదుట వరదపాశం పోసి తమ మొక్కులను చెల్లించి అక్కడే సహంపక్తి భోజనాలు చేయడం అనావాయితీ.
రెండవ సోమవారం సందర్భంగా భక్తులతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండ కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లను చేశారు. భక్తులకు కొండ కింద గ్రామానికి చెందిన శివ శ్రీనివాస్ మల్లీశ్వరి దంపతుల ఆధ్వర్యంలో మహా అన్నదానం చేశారు. ఆలయ ప్రధాన ఆర్చకుడు బల్యపల్లి ప్రభాకరశర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలను చేశారు. ఈ వేడుకల్లో ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, అదిలాబాద్ జిల్లాలతో పాటు, మహారాష్ట్ర ప్రాంతాలను నుండి భక్తులు తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ చిట్యాల లక్ష్మణ్, ఆలయ కమిటీ అధ్యక్షుడు క్యాతం సురేష్ రెడ్డి, మాజీ చైర్మన్ సంగ గంగారాజం, ఉపసర్పంచ్ గడ్డం సోమారెడ్డి, మాజీ జడ్పీటీసీ సందిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, కమిటీ సభ్యులు, అధికారులు, అఖిలపక్షం పార్టీల నాయకులు, భక్తులు, తదితరులు పాల్గొన్నారు.