హుజూరాబాద్ టౌన్, నవంబర్ 2: దళిత బంధు పథకాన్ని సద్వినియోగం చేసుకొని దళితులు స్వయంకృషితో ఆర్థికంగా ఎదగాలని, పదిమందికి స్ఫూర్తినివ్వాలని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ సూచించారు. బుధవారం పట్టణంలో దళిత బంధు పథకం కింద మంజూరైన లక్ష్మీ గణపతి ఎంటర్ప్రైజెస్ యూనిట్ను ఆయన పరిశీలించారు. లబ్ధిదారుడిని పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, నాణ్యతమైన వస్తువులకు మార్కెట్లో ఎప్పుడు డిమాండ్ ఉంటుందన్నారు. డిమాండ్ కనుగుణంగా వస్తువులను తయారు చేస్తూ మారెట్లో విక్రయించాలన్నారు. కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
జమ్మికుంట రూరల్, నవంబర్ 2: పట్టణంలో పలువురు లబ్ధిదారులు ఏర్పాటు చేసుకున్న దళిథబంధు యూనిట్లను బుధవారం కలెక్టర్ ఆర్వీ కర్ణన్ పరిశీలించారు. వాటి నిర్వహణ, వస్తున్న ఆదాయం తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దళిత బంధు పథకం రెండో విడుత డబ్బులను త్వరలోనే అందజేస్తామన్నారు. ప్రతి లబ్ధిదారుడు వ్యాపారంలో రాణించాలని సూచించారు. అనంతరం జమ్మికుంట మండలం వెంకటేశ్వర్లపల్లిలో దళిత బంధు పథకం లబ్ధిదారులు ఏర్పాటు చేస్తున్న ఏడు కోళ్లఫారాలను కలెక్టర్ పరిశీలించారు. ఇక్కడ తహసీల్దార్ రాజేశ్వరి, ఎస్సీ కార్పొరేషన్ ప్రత్యేకాధికారి సురేశ్, క్లస్టర్ అధికారి శ్రీమాల, ఈడీ నాగార్జున, మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య, ఎంపీడీవో సతీశ్రావు తదితరులు ఉన్నారు.