సారంగాపూర్, జూలై 3: రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు సామాజిక, ఆర్థిక ప్రోత్సాహం కల్పించాలని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్రెడ్డి డిమాండ్ చేశారు. సారంగాపూర్ మండలం లక్ష్మీదేవిపల్లిలో శుక్రవారం ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో పెద్దమ్మ పట్నాలు వేశారు. పెద్దమ్మ బోనాలు తీశారు. జీవన్ రెడ్డి పాల్గొని, ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. పెద్దమ్మ తల్లి ప్రజలందరినీ సల్లంగా చూడాలని వేడుకున్నారు. అనంతరం మాట్లాడారు.
కాంగ్రెస్ ఎన్నికల ముందు కామారెడ్డి డిక్లరేషన్లో బీసీ జనాభా పరిగణలోకి తీసుకుని 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చిందని, అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడుస్తున్నా అది అమలుకు నోచుకోవడం లేదని మండిపడ్డారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సమగ్ర కుటుంబ సర్వే చేయిస్తే అప్పుడు బీసీ జనాభా 51శాతం వచ్చిందని, మొన్న రేవంత్రెడ్డి సర్వే చేయిస్తే ఐదు శాతం తగ్గించి 46శాతానికి పరిమితం చేశారని విమర్శించారు.
రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన ముదిరాజ్లు ఆర్థికంగా వెనుకబడి ఉన్నారని తెలిపారు. ఉపాధిపరంగా చెరువులు, కుంటలు పండ్లు, ఫలాలకు సంబంధించి ప్రభుత్వం ప్రోత్సాహం అందించడంతోపాటు విద్యా ఉద్యోగాల్లో కూడా అవకాశాలు కల్పించాలన్నారు. వ్యవసాయాన్ని రంగాన్ని ప్రోత్సహించే క్రమంలో తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ రైతుబీమా, రైతుబంధు అమలు చేశారని, ధాన్యం కొనుగోళ్లు చేపట్టి భరోసానిచ్చారని గుర్తు చేశారు. కానీ, కాంగ్రెస్ సర్కారు అన్ని వర్గాలను గోస పుచ్చుకుంటున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో యువజన నాయకులు చంద్రకృష్ణారెడ్డి, హరిచరణ్రావు, తేలు రాజు, కొండ్ర రాంచందర్రెడ్డి, ఆకుల రమేశ్, ఆకుల రాజిరెడ్డి, జున్ను రాజేందర్, మైపాల్రెడ్డి, ఉప్పు మహేశ్, ముదిరాజ్ సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు.