కార్పొరేషన్, డిసెంబర్ 25: ఒకరికొకరు ఆత్మీయంగా, సోదరభావంతో కలిసి మెలిసి ఉండేందుకు సంఘ భవనాలు వేదికలుగా నిలుస్తాయని నగర మేయర్ యాదగిరి సునీల్రావు పేర్కొన్నారు. స్థానిక 33వ డివిజన్ భగత్నగర్లో భగత్నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యుల సమష్టి సహకారంతో రూ.కోటి నిధులతో నూతనంగా నిర్మించిన భగత్ వెల్ఫేర్ అసోసియేషన్ సంఘ భవనాన్ని ఆదివారం వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు, మేయర్ యాదగిరి సునీల్రావు ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన భవనంలో ప్రత్యేకంగా సమావేశాలు, చిన్న చిన్న శుభకార్యాలు, కిట్టి పార్టీలకు ప్రత్యేక హాల్, క్యారం, చెస్ లాంటి గేమ్స్ ఆడుకోవడానికి ఇన్డోర్ హాల్, రెస్టు రూం లాంటి సౌకర్యాలను కల్పించామన్నారు. భగత్నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులంతా భవన నిర్మాణం కోసం సమష్టి కృషితో నిధులను పోగుచేసుకొని స్థలాన్ని కొనుగోలు చేసి అత్యాధునిక హంగులతో భవనాన్ని నిర్మించుకోవడం చాలా సంతోషకరమన్నారు.
భగత్నగర్ ప్రాంతం నగరంలో ఒక మాడల్ కాలనీగా మారి వాడ ప్రజలంతా ఒకే కుటుంబంలా ఆత్మీయంగా, సోదరభావంతో కలిసిమెలిసి జీవించడం జరుగుతుందన్నారు. ఎలాంటి శుభకార్యాలు జరిగినా సోదరభావంతో ఆనందాన్ని పంచుకుంటారని తెలిపారు. అత్యాధునిక వసతి సౌకర్యాలతో సుందరమైన భవనం నిర్మించుకోవడం అందరి అదృష్టమని పేర్కొన్నారు. ఈ భవనం భావితరాలకు కూడా ఉపయోగపడే విధంగా ఎవరింట్లో ఎలాంటి శుభకార్యాలు జరిగినా వాడుకునేందుకు తగిన వసతులను కల్పించామని వివరించారు.
భగత్నగర్లోని మహిళలు, సీనియర్ సిటిజన్లు సమావేశాలు నిర్వహించుకునేందుకు, రీడింగ్ చేసేందుకు, క్యారం, చెస్ లాంటి ఇండోర్ గేమ్స్ ఆడుకునేందుకు, విశ్రాంతి తీసుకునేందుకు వసతి సౌకర్యాలు కల్పించుకున్నామని తెలిపారు. నగరంలో భగత్నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఒక ఆదర్శ సంఘంగా ఉండే విధంగా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. నగరపాలక సంస్థ ద్వారా కూడా నగరంలోని మిగిత డివిజన్లలో కమ్యూనిటీ భవనాల నిర్మాణానికి నిధులను కేటాయిస్తున్నామని చెప్పారు. రాబోయే రోజుల్లో ఎకడ స్థలం ఉన్నా కమ్యూనిటీ హాల్స్ నిర్మించేందుకు మంత్రి గంగుల కమలాకర్ కృషి చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో భగత్నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు చీటీ రామారావు, మనోహర్, గాంధీ, హరికిషన్ తదితరులు పాల్గొన్నారు.