తెలంగాణచౌక్, డిసెంబర్ 6: కాంగ్రెస్కు గట్టి దెబ్బ తాకింది. సీనియర్ నాయకుడు, ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి చల్మెడ లక్ష్మీనరసింహారావు తన పదవికి, పార్టీకి సోమవారం రాజీనామా చేశారు. ఈ మేరకు నగరంలోని ప్రెస్ భవన్లో విలేకరులతో వివరాలు వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ తనకు ఇప్పటివరకు రెండుసార్లు ఎమ్యెల్యేగా, ఒకసారి ఎమ్మె ల్సీ ఎన్నికల్లో పోటీకి అవకాశం ఇచ్చిందని చెప్పారు. కానీ నాయకుల అంతర్గత కుమ్ములాటలతో తనను కావాలనే ఓడించారని, తక్కువ మెజార్టీతో ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా ఓడిపోయినట్లు గుర్తు చేసుకున్నారు. కాంగ్రెస్ గెలుపుకన్నా టీఆర్ఎస్ను ఓడించాలనే లక్ష్యంతో ఇతర పార్టీలతో లోపాయికారి ఒప్పందాలు చేసుకుంటున్నారని ఆరోపించారు. ఇందుకు నిదర్శనం హుజూరాబాద్ ఉప ఎన్నికలేనని స్పష్టం చేశారు. పార్టీ అభ్యర్థిని చివరివరకు ప్రకటించకుండా ఆలస్యం చేసి, ఆఖరికి బయట వ్యక్తిని తీసుకొచ్చి బరిలో పెట్టారని, దీంతో ఘోర పరాజయం పాలైందని చెప్పారు. పార్టీలోని నేతలు జాతీయ స్థాయి పార్టీ నాయకులుగా వ్యవహరించడం లేదని మండిపడ్డారు.
కొత్త అధ్యక్షుడు వచ్చినా తీరు మారలే..
కాంగ్రెస్కు కొత్త అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి వచ్చినా ప్రదేశ్ భవన్లో కుమ్ములాటలు, బాహాబాహీలు కనబడుతున్నాయని, పార్టీలో ఐక్యత కొరవడిందని దుయ్యబట్టారు. బీజేపీ పాలనలో దేశంలో పెరుగుతున్న నిత్యావసర ధరలతోపాటు రైతు చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం చేయడంలో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్కు రానున్నకాలంతో భవిష్యత్లేదని చెప్పారు.
టీఆర్ఎస్లోకి వెళ్తా..
రాష్ట్రంలో సీఎం కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని నిర్ణయం తీసుకున్నట్లు లక్ష్మీనరసింహారావు తెలిపారు. కేసీఆర్ పాలనలో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో కొనసాగుతున్నదని చెప్పారు. ప్రజ లు ఆదరించే పార్టీలో ఉండి పనిచేయాలని భావించి తన అభిమానులు, కార్యకర్తలు, అనుచరులతో చర్చించి టీఆర్ఎస్లోకి వెళ్తున్నానని వివరించారు. ఎలాంటి పదవులు ఆశించి వెళ్లడం లేదని చెప్పారు. ఈ నెల 8న మధ్యాహ్నం తెలంగాణ భవన్ వేదికగా టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. సమావేశంలో కాంగ్రెస్ నాయకులు శ్రీనివాస్, కొత్తపల్లి కౌన్సిలర్ విజయ, యూత్ కాంగ్రెస్ పార్లమెంట్ ఇన్చార్జి ఫణిచరణ్రావు, గున్నరమేశ్, మారుతిరావు ఉన్నారు.