Free training | కోల్ సిటీ, జూన్ 11: రామగుండం నియోజక వర్గ నిరుద్యోగులకు ఒకే చోట ఉచిత శిక్షణ ఇచ్చేందుకు హైదరాబాద్ లో ని పీజేఆర్ సంస్థ ముందుకు వచ్చిందని రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి తెలిపారు. నగర పాలక కార్యాలయంలోని ఆయన చాంబర్ లోని గురువారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వివిధ ప్రభుత్వ ఉద్యోగాలు, ముఖ్యంగా పోలీస్ ఉద్యోగాలు సాధించే లక్ష్యంగా ఎదురుచూస్తున్న నియోజక వర్గంలోని యువతీ యువకులకు ఒకే చోట 3 నెలల పాటు కార్పొరేట్ స్థాయి ఉచిత శిక్షణ ఇస్తారని తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే సూచనల మేరకు పీజేఆర్ సంస్థ నిర్వాహకుడు పీ.జగదీశ్వర్ రెడ్డి ముందుకు వచ్చారనీ, మున్సిపల్, సింగరేణి సహకారంతో స్థానిక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, సింగరేణి పాఠశాలలో ప్రత్యేక గదులను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
ఇందుకోసం మున్సిపల్ ఆఫీసులో శుక్రవారం నుంచి 25వ తేదీ వరకు ప్రత్యేక కౌంటర్ తెరచి ఉంటుందనీ, ఆసక్తి గల నిరుద్యోగులు దరఖాస్తులు పూర్తి చేయాలని తెలిపారు. 3 నెలల పాటు జరిగే శిక్షణలో అభ్యర్థులకు ఉచితంగా స్టడీ మెటీరియల్ అందజేస్తారన్నారు. కోడింగ్ విధానంలో పరీక్ష కూడా ఉంటుందన్నారు. నిష్ణాతులైన 10 మంది శిక్షకులచే కోచింగ్ ఉంటుందన్నారు. గ్రూప్, ఫారెస్టు, పోలీస్, టెట్, తదితర ప్రభుత్వ ఉద్యోగాలు సాధించే లక్ష్యంతో నిరుద్యోగులు ఇతర ప్రాంతాలకు వెళ్లకుండే ఇక్కడే కార్పొరేట్ స్థాయిలో శిక్షణ ఉంటుందన్నారు. శిక్షణ కాలంలో ఉచిత భోజన వసతి ఉంటుందన్నారు.
నిరుద్యోగులు ఈ అవకాశంను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నిర్వాహకులు జగదీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ఇప్పటివరకు 47 నియోజక వర్గాల్లో నిరుపేద నిరుద్యోగులకు కార్పొరేట్ తరహాలో ఉచితంగా శిక్షణ ఇచ్చామనీ, 13 వేల మంది ఉద్యోగాలు సాధించారన్నారు. ముఖ్యంగా 20వేల మంది పోలీసులను తయారు చేయాలన్నదే తమ సంస్థ లక్ష్యమన్నారు. స్థానిక ఎమ్మెల్యే సూచనల మేరకు రామగుండం నియోజక వర్గ నిరుద్యోగులకు కూడా 3 నెలల పాటు ఉచిత శిక్షణ ఇవ్వడానికి ముందుకు వచ్చినట్లు తెలిపారు. సమావేశంలో డిప్యూటీ మేయర్ పాతపల్లి ఎల్లయ్య, కార్పొరేటర్లు పాల్గొన్నారు.