అర్ధాకలితో సర్కారు పాఠశాలలకు వస్తున్న విద్యార్థుల ఆకలి తీరుస్తున్నది సత్యసాయి అన్నపూర్ణ ట్రస్ట్. గ్రామీణ ప్రాంత నిరుపేద విద్యార్థులకు రాగి జావ పంపిణీ చేస్తూ కడుపు నింపుతున్నది. నెలకు 10 వేల మందికి పోషకాహారం అందిస్తుండగా చిన్నారుల నుంచి ఆనందం వ్యక్తమవుతున్నది.
– జగిత్యాల విద్యానగర్, డిసెంబర్ 25
జగిత్యాలలో 2015 నవంబర్ 23న మోతె గ్రామ శివారులోని నాగేంద్ర నగర్ కాలనీలో సాంఘిక సంక్షేమ పాఠశాలలో మొదటగా 50మంది విద్యార్థులకు పాలు, హార్లిక్స్తో ప్రతిరోజు ఉదయం సేవను ఆరంభించారు. కరోనా ముందు వరకు 500 మందికి 12 ప్రభుత్వ పాఠశాలల్లో పాలు, ట్రస్ట్ వారు తయారు చేసిన సాయి ష్యూర్ ప్రొటీన్ పౌడర్ను అందించారు. కరోనా తర్వాత రాగిజావ సేవను పోషకాహార పానీయ సేవలో కలిపారు. ప్రస్తుతం జిల్లాలో ప్రతినెల 10వేల మంది పిల్లలకుపైగా పౌష్టికాహారం అందిస్తున్నారు.
ఈ సేవలో భాగంగా 2018సంవత్సరంలో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ తన స్వగ్రామం అంతర్గాం ప్రభుత్వ పాఠశాలలో రాగిజావ సేవ పంపిణీని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి సత్యసాయి అన్నపూర్ణ ట్రస్ట్ జిల్లా బాధ్యులుగా వూటూరి శ్రీకాంత్ ఉండగా వారి మిత్ర బృందంలో కోటగిరి శ్రీనివాస్, జైశెట్టి రాజశేఖర్ ముఖ్య ప్రతినిధులుగా సేవా కార్యక్రమానికి సహకరిస్తున్నారు. జిల్లాకు చెందిన సామ ఉమాపతి, పీ భూమేశ్వర్, నవత రాజు, బీ జగత్, కే భూషణం కొన్ని పాఠశాలలను దత్తత తీసుకొని పాలు, బిస్కెట్లు సైతం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాగిజావ, పాలు తాగిన తర్వాత పిల్లల ముఖాల్లో చూసిన ఆనందం, తృప్తిలోనే తాము ఆ భగవంతుడిని చూస్తున్నామన్నారు. సత్యసాయి 97వ జయంతి సందర్భంగా కోరుట్ల జడ్పీహెచ్ఎస్లో ఈ కార్యక్రమాన్ని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ప్రారంభించారు.
గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల్లో చాలామంది నిరుపేదలే. వీరి తల్లిదండ్రులు వ్యవసాయ, ఇతర కూలీలుగా జీవనం సాగిస్తుంటారు. నిత్యం పనులకు వెళ్లాల్సిరావడంతో ఉదయం వేళ వంట చేయడం వీలుకాదు. దీంతో విద్యార్థులు ఖాళీ కడుపులతోనే బడులకు వెళ్తుంటారు. ఆకలితో అలమటిస్తూనే టీచర్లు చెప్పే పాఠాలు వింటుంటారు. చదువుపై ధ్యాసపెట్టకుండా మధ్యాహ్న భోజనం కోసం ఎదురు చూడాల్సిన దయనీయస్థితి. వేళకు తినే అవకాశం లేకపోవడంతో రోగాల బారిన పడుతున్నారు. వీరి దీనస్థితిని చూసి ఆకలి తీర్చేందుకు సత్యసాయి అన్నపూర్ణ ట్రస్ట్ ముందుకు వచ్చింది. విద్యార్థుల పుష్టికి రాగిజావ బెల్లంలో కలిపి అందిస్తూ చేయూతనందిస్తున్నది.
విద్యార్థులకు ఎంతో మేలు
శ్రీ సత్యసాయి అన్నపూర్ణ ట్రస్ట్ ఉచితంగా అందజేస్తున్న పోషకాహారం (రాగిజావ) మా పాఠశాల విద్యార్థులు తీసుకుంటున్నారు. దీంతో మా విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుంది. పిల్లలకు ఆరోగ్యానికి ఇది బలంగా పనిచేస్తూ చక్కగా చదువుకోవడానికి తోడ్పడుతుంది. ఉదయం ఎలాంటి ఆహారం తీసుకోని విద్యార్థులు వీరు అందిస్తున్న రాగిజావతో సంతోషంగా ఉన్నారు.
– నీలగిరి జయసింహా రావు, ప్రధానోపాధ్యాయుడు, జడ్పీహెచ్ఎస్ రంగపేట, సారంగాపూర్ మండలం
విద్యార్థుల ఆరోగ్యాన్ని కాపాడేందుకే..
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు సరిగా భోజనం చేయకపోవడంతో ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది. దీనికి కారణం వారి పేదరికం, తదితర సమస్యలు కావచ్చు. వారి ఆరోగ్యాన్ని కాపాడేలా తమ ట్రస్ట్ తరపున విద్యార్థులకు రాగిజావ అందిస్తున్నారు. నాణ్యమైన బెల్లం, రాగిపిండిని సరఫరా చేస్తున్నాం. రాగిజావ తాగడం వల్ల పిల్లల్లో రక్తహీనత తగ్గి వారు ఆరోగ్యంగా ఉంటారు.
– వూటూరి శ్రీకాంత్, రీజినల్ కోఆర్డినేటర్, తెలంగాణ రాష్ట్రం.
పోషకాహార లోపం నివారణకే..
ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు ఎక్కువ శాతం మంది ఉదయం ఖాళీ కడుపుతో రావడం వల్ల పోషకాహార లోపానికి గురవుతున్నారు. చదువుపై శ్రద్ధ చూపడం లేదని గ్రహించిన శ్రీ సత్యసాయి బాబా శిష్యులు శ్రీ మధుసూదన్ సాయి పిల్లలకు రాగి మాల్ట్, బెల్లం తగిన మోతాదులో కలిపిన పానీయాన్ని ఇవ్వడం ద్వారా ఈ లోపానికి దూరం చేయవచ్చని గ్రహించి, ఆ దిశగా చేస్తున్న ఈ కార్యక్రమం నిజంగా స్వాగతించాల్సిన విషయం. దీని ద్వారా పిల్లలకు సూక్ష్మ పోషకాలు అంది మానసికంగా, శారీరకంగా ధృఢమై శ్రద్ధగా చదువుతారు.
– జైశెట్టి రాజశేఖర్, ట్రస్ట్ ప్రతినిధి, జగిత్యాల.
చక్కని పోషకాహారం
పాఠశాలల్లో పోషకలోపంతో బాధపడుతున్న విద్యార్థులకు రాగిజావ చక్కని పోషకాహారం. పిల్లలు ప్రతిరోజు దీన్ని తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. రాగిజావ పాఠశాలల్లో పంపిణీ చేస్తుండడంతో ప్రధానోపాధ్యాయులకు ఊరటనిచ్చింది. ఎందుకంటే రాగిజావ తాగిన తర్వాత విద్యార్థులు సరిగా క్లాసులు వినే అవకాశం ఉంది. దీనిలో ఉన్న శక్తితో మానసిక, శారీరక స్థాయిని పెంచి చురుకుగా పాఠాలు నేర్చుకోగలుగుతారు.
– కోటగిరి శ్రీనివాస్, అన్నపూర్ణ ట్రస్ట్ ప్రతినిధి.