గొల్లపల్లి/ధర్మారం, డిసెంబర్ 16 : సీఎంఆర్ఎఫ్ వినియోగంలో ధర్మపురి నియోజకవర్గం రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచిందని, అందుకు తమ కార్యనిబద్ధతే కారణమని మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. శుక్రవారం గొల్లపల్లి మండల కేంద్రంతోపాటు మల్లన్నపేట, ధర్మారం మండల కేంద్రంలో పర్యటించారు. ముందుగా గొల్లపల్లి మండల పరిషత్ కార్యాలయంలో 44 మంది లబ్ధిదారులకు రూ.15.50 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. అలాగే, మల్లన్నపేటలో మల్లికార్జునస్వామి జాతరకు తన సతీమణి ఎల్ఎం కొప్పుల సోషల్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ చైర్పర్సన్ స్నేహలతతో కలిసి హాజరయ్యారు. స్వామివారిని దర్శించుకుని, పట్టువస్ర్తాలు సమర్పించారు.
ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం నిలువెత్తు బంగారం(బెల్లం) తులాభారం సమర్పించారు. తర్వాత గొల్లపల్లి మండలం కొసనపల్లిలోని శ్రీ స్వయంభూ దక్షిణ కాశీ కాలభైరవస్వామి జయంతి వేడుకలకు హాజరయ్యారు. అన్నదానం చేశారు. ఆయా కార్యక్రమాల్లో మంత్రి మాట్లాడారు. అనారోగ్య బాధితులకు రాష్ట్ర సర్కారు ఎల్లవేళలా అండగా ఉంటూ మెరుగైన చికిత్సకు ఎల్వోసీలు, సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందిస్తున్నదని పేర్కొన్నారు. రాష్ట్రంలోనే ధర్మపురి నియోజకవర్గం అగ్రస్థానంలో నిలుస్తున్నదని, ఇప్పటివరకు రూ.35 కోట్ల ఎల్వోసీలు, సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందించినట్లు చెప్పారు. అనంతరం దమ్మన్నపేటలో రూ.1.80 కోట్ల విలువైన సీసీ రోడ్లు, మురుగు కాలువల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. చందోలిలో బీరయ్య ఆలయ నిర్మాణానికి భూమిపూజ చేశారు.
దట్నూర్లో వాగుపై రూ.3 కోట్లతో బ్రిడ్జి నిర్మాణానికి, రూ.10 లక్షలతో మురుగు కాలువలు, లొత్తునూర్లో సదాజల వాగుపై రూ.2 కోట్లతో బ్రిడ్జి, ఎస్సీ కాలనీలో రూ.30 లక్షలతో సీసీ రోడ్లు, మురుగు కాలువలు, బీసీ కాలనీలో రూ.30 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అలాగే, ధర్మారం మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ ఎదుట ఎనేబుల్ ఇండియా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో గర్వసే దివ్యాంగుల సేవా కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ దివ్యాంగులకు అన్ని రంగాల్లో ఎంతో ప్రాధాన్యం ఇచ్చి ప్రోత్సహిస్తున్నారన్నారు. ఆయా కార్యక్రమాల్లో సర్పంచులు అమృత, తిరుపతి, రవీందర్, పావనీ నగేశ్, మహేశ్వరి, నర్సయ్య, అనంత రెడ్డి, ఎంపీటీసీ రాజన్న, జడ్పీటీసీ జలంధర్, వైస్ ఎంపీపీ సత్తయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ హన్మాండ్లు, ప్యాక్స్ చైర్మన్ మాధవరావు, ఆర్బీఎస్ అధ్యక్షుడు కిష్టారెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రమేశ్, సర్పంచుల ఫోరం జిల్లా అధ్యక్షుడు గంగారెడ్డి, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు రమేశ్ తదితరులు పాల్గొన్నారు.