సిరిసిల్ల కలెక్టరేట్, అక్టోబర్ 19: పోలింగ్ రోజు ప్రారంభం నుంచి పూర్తయ్యే వరకు చేపట్టాల్సిన పనులపై సెక్టార్ అధికారులకు సంపూర్ణ అవగాహన ఉండాలని కలెక్టర్ అనురాగ్ జయంతి సూచించారు. అప్పుడే సెక్టార్ అధికారులు తమ పరిధిలోని పోలింగ్ కేంద్రాల ప్రిసైడింగ్ అధికారులకు, ఇతర ఎన్నికల సిబ్బందికి మార్గనిర్దేశం చేయగలుగుతారని చెప్పారు. గురువారం కలెక్టరేట్లోని సమావేశ హాలులో పోలింగ్ డే రోజు కేంద్రాల్లో నిర్వహించాల్సిన విధులపై సెక్టార్ అధికారులు, తహసీల్దార్లు, నోడల్ అధికారులకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు.
డెమో ఓటింగ్ మిషన్ల ద్వారా పోలింగ్ రోజు చేయాల్సిన విధులు, డాక్యుమెంటేషన్పై కలెక్టర్, మాస్టర్ ట్రైనర్లు ప్రత్యక్ష అవగాహన కల్పించారు. పోలింగ్ రోజు మాక్ పోలింగ్ అయిందో లేదో పరిశీలించడం, మాక్ పోలింగ్లో నమోదైన ఓటర్లను క్లియర్ చేయడం, పోలింగ్ను ప్రారంభించడం, ప్రతీ రెండు గంటలకోసారి ఓటింగ్ శాతాన్ని తెలుపడం, పోలింగ్ ప్రారంభానికి ముందు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లో ఏవైనా సాంకేతిక సమస్యలు ఉత్పన్నమైతే తీసుకోవాల్సిన చర్యలు, పోలింగ్ పూర్తయిన ఈవీఎంలకు సీల్ వేయడం, సంబంధిత పత్రాలు పూరించడం తదితర అంశాలను అధికారులకు వివరించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ అనురాగ్ జయంతి మాట్లాడారు. ఎన్నికల మార్గదర్శకాలు, పోలింగ్ విధులపై ప్రతి అధికారి స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలన్నారు. అప్పుడే ఎన్నికల పోలింగ్ సజావుగా పూర్తయ్యేలా మానిటరింగ్ చేయగలుగుతారన్నారు. ఏమైనా సమస్యలు ఉత్పన్నమైతే సరైన రీతిలో పోలింగ్ అధికారులను గైడ్ చేస్తూ పరిష్కారం చూపుతారన్నారు. శిక్షణా కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యానాయక్, వేములవాడ ఆర్డీవో మధుసూదన్, శిక్షణా పర్యవేక్షకులు పిబి.శ్రీనివాసచారి, డీఆర్డీవో నక్క శ్రీనివాస్, మాస్టర్ ట్రైనర్లు పాల్గొన్నారు.