రాజన్న సిరిసిల్ల, మార్చి 2 (నమస్తే తెలంగాణ): రాజకీయాలతీతంగా, అవినీతికి ఆస్కారం లేకుండా సిరిసిల్ల సహకార విద్యుత్ సంస్థ (సెస్) అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నదని చైర్మన్ చిక్కాల రామారావు స్పష్టం చేశారు. సిరిసిల్ల జిల్లాకేంద్రంలోని సెస్ కార్యాలయంలోని తన చాంబర్లో శనివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వినియోగదారులు ఎన్నుకున్న పాలకవర్గం పారదర్శకంగా సేవలందిస్తుంటే కొందరు కావాలని సెస్ సంస్థపై అవినీతి బురద జల్లడం విచారకరమన్నారు. సంస్థ దినదినాభివృద్ధి చెందుతుంటే జీర్ణించుకోలేక సంస్థపై దుష్ప్రచారం చేయడం దురదృష్టకరమని, సంస్థకు రాజకీయ రంగు పులుమడం సరికాదని విజ్ఞప్తి చేశారు.
విద్యుత్ కొనుగోలు చేసిన ఎన్పీడీసీఎల్ సంస్థకు సెస్ 545 కోట్లు బకాయిలున్నది వాస్తవమేనని తెలిపారు. బకాయిలు చెల్లించలేని స్థితిలో ఉన్న సెస్ను ప్రభుత్వంలో విలీనం చేయాలంటూ ఈఆర్సీ సూచన మాత్రమే చేసిందన్నారు. ఎన్పీడీసీఎల్కు బకాయిలున్నట్టు చెప్పిన ఈఆర్సీ, ప్రభుత్వం నుంచి 600 కోట్లు సెస్కు రావాల్సి ఉన్న విషయాన్ని ఎందుకు ప్రస్తావించలేదని ఆయన ప్రశ్నించారు. 2022 జూలైలో 11కోట్లున్న విద్యుత్ డిమాండ్ను 19కోట్లకు పెంచినట్లు తెలిపారు. ప్రస్తు తం విద్యుత్ చార్జీలు కూడా పెంచిందని, 4.85 పైసలకు యూని ట్ కొంటున్న సెస్, 6.50పైసలకు విక్రయించాల్సి ఉందన్నారు.
సంస్థలో అవినీతికి పాల్పడ్డ 13 మంది సిబ్బందిని సస్పెండ్ చేసి చర్యలు తీసుకున్నామని చెప్పారు. అవినీతి, అక్రమాలకు పాల్పడితే ఎంతటి వారైనా సరే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. సిరిసిల్ల మరమగ్గాల ఎస్ఎస్ఐ యూని ట్లు 22కోట్లు బకాయిలున్నాయన్నారు. వినియోగదారులందరూ సకాలంలో విద్యుత్ బిల్లు లు చెల్లించి సంస్థ అభివృద్ధికి సహకరించాలని కోరారు. 2.98లక్షల వినియోగదారులున్న సెస్ సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం సహయ సహకారాలందిస్తుందన్న నమ్మకం ఉందన్నారు. సహకార రంగంలో ఆదర్శవంతంగా నడుస్తున్న సెస్ను ఎల్లవేళలా కాపాడుకుంటామని స్పష్టం చేశారు.