Chigurumamidi | చిగురుమామిడి, ఆగస్టు 31: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను పూర్తిగా విస్మరించిందని, ప్రభుత్వ వెయ్యి రోజుల పాలన వైఫల్యాలను ప్రజలు ముందుకు తీసుకెళ్లి ఎండగడతామని హుస్నాబాద్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే వోడితల సతీష్ కుమార్ స్పష్టం చేశారు. హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుమేరకు సెప్టెంబర్ 2 నుంచి వారం రోజులపాటు హుస్నాబాద్ నియోజకవర్గం లోని అన్ని మండలాల్లో గ్రామాల్లో వినూత్న నిరసన కార్యక్రమాలు చేపడతామని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 100 రోజుల గ్యారెంటీలు ఏమయ్యాయని, వెయ్యి రోజులైనా గ్యారంటీలు అమలు కాలేదని ప్రజలకు ఏమని సమాధానం చెప్తారని ఎద్దేవా చేశారు. రైతులకు, మహిళలలకు, యువత, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. వృద్ధులు పేదలు కార్మికులు రైతులు ఉద్యోగులకు హామీల పరిస్థితి ఏంటని అన్నారు.
ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని గుర్తు చేస్తూ ప్రతీ లెక్కను ప్రజలకు వివరిస్తామన్నారు. సెప్టెంబర్ 2 నుంచి ప్రారంభమయ్యే నిరసన కార్యక్రమాల్లో కాంగ్రెస్ హామీల బాకీ కార్డు ప్రదర్శనతో గ్రామ గ్రామాన ప్రజలకు అవగాహన కల్పిస్తామన్నారు. సోషల్ మీడియా ద్వారా ప్రజలకు వాస్తవ పరిస్థితులను వివరిస్తామన్నారు. స్థానిక సమస్యలపై ప్రజలతో కలిసి ఆందోళనలో పాల్గొంటామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రతీ హామీకి కాంగ్రెస్ ప్రభుత్వం లెక్క చెప్పాల్సిందేనని, ప్రజలు మర్చిపోలేదన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను కూడా ప్రజలకు వివరిస్తామన్నారు. సెప్టెంబర్ 2 నుంచి వారం రోజులపాటు నిర్వహించే కార్యక్రమాల్లో నియోజకవర్గంలోని బీఆర్ఎస్ శ్రేణులు, ప్రజాప్రతినిధులు, మహిళలు, యువజన నాయకులు పెద్ద ఎత్తున పాల్గొనాలని సతీష్ కుమార్ పిలుపునిచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఎన్నికల హామీల అమలు కోసం బీఆర్ఎస్ పోరాటం ఆగదని, ప్రజల పక్షాన బీఆర్ఎస్ ఉద్యమిస్తూనే ఉంటుందని సతీష్ కుమార్ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ మండల మాజీ అధ్యక్షుడు మామిడి అంజయ్య, జిల్లా నాయకులు కొత్త శ్రీనివాస్ రెడ్డి, సాంబారి కొమురయ్య, సర్పంచ్ బోయిని రమేష్, మండల నాయకులు బుర్ర తిరుపతి, జక్కుల రవి, సర్వర్ పాషా, బెజ్జంకి రాంబాబు, బెజ్జంకి లక్ష్మణ్, చెప్యాల నారాయణరెడ్డి, కూతురు చరబంధరెడ్డి,ఎండ్ర నారాయణ, కాశబోయిన రాజు, కృష్ణారెడ్డి, రమేష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.