అప్రమత్తతతో విధులు.. రోగుల పాలిట ఆపద్బాంధవులు
నేడు జాతీయ పైలట్ల దినోత్సవం
విద్యానగర్, మే 25 : ఎక్కడ ఎవరికి ఏ ఆపదొచ్చినా ఫోన్ చేసిన క్షణాల్లోనే కుయ్..కుయ్ అంటూ వచ్చే వాహనం 108 అంబులెన్స్. మనిషి ప్రాణాలు కాపాడడంలో ఆ వాహనం పాత్ర ఎంత ఉందో, అంతకు రెట్టింపు పాత్ర వాహనం నడిపే పైలట్లది. కొన ఊపిరితో కొట్టుమిట్టాడే వారికి వైద్య సేవలందిస్తూ, మెరుగైన వైద్యం కోసం మెరుపు వేగంతో దవాఖానకు చేర్చడంలో వారికి వారే సాటి. నేడు జాతీయ పైలట్ల దినోత్సవంగా వారి సేవలపై ప్రత్యేక కథనం..
ఎలాంటి విపత్తులు ఎదురైనా, తమ ప్రాణాలను పణంగా పెట్టి, ఆపదలో ఉన్న వారి ప్రాణ రక్షణే పరమావధిగా పైలట్లు విధులు నిర్వర్తిస్తున్నారు. రోగుల పాలిట ఆపద్బాంధవులుగా నిలుస్తున్న వారి సేవలను గుర్తు చేసుకునేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక రోజు కేటాయించింది. ఏటా మే 26న జాతీయ పైలట్ల దినోత్సవంగా ప్రకటించి గౌరవించింది. వైద్య సేవలపై ప్రాథమిక శిక్షణ ఇచ్చిన అనంతరం వీరిని ప్రభుత్వం ఏర్పాటు చేసిన 108 అంబులెన్సుల్లో డ్రైవర్లుగా నియమిస్తున్నారు. ముందుగా హైదరాబాద్ జీవీకే ఈఎంఆర్ఐ ప్రధాన కార్యాలయంలో వారం పాటు శిక్షణ ఇస్తున్నారు. సమర్థవంతమైన డ్రైవింగ్, ప్రమాదాల బారిన పడ్డవారికి ప్రథమ చికిత్స చేయడం, ఆపదలో ఉన్న వారికి అందించే అత్యవసర చికిత్సలపై అవగాహన కల్పిస్తారు.
ఉమ్మడి జిల్లాలో 38 అంబులెన్స్లు
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 108 అంబులెన్స్ వాహనాలు 38 ఉన్నాయి. కరీంనగర్లో 14 వాహనాలు ఉండగా, 35 మంది పైలట్లు, పెద్దపల్లిలో 8 అంబులెన్సులకు 20 మంది, జగిత్యాల ఏడు వాహనాలకు 13 మంది, సిరిసిల్ల 9 అంబులెన్సులుండగా 20 మంది పైలట్లుగా విధులు నిర్వహిస్తున్నారు. వీరంతా ఆపదలో ఉన్న వారిని రక్షించే అవకాశం లభించడం తమ అదృష్టంగా భావిస్తుంటారు. విధి నిర్వహణలో ఎవరి సహాయ సహకారాలు ఉన్నా, లేకున్నా తమ పని తాము చేసుకుపోతూ, రోగుల ప్రాణాలు కాపాడడంలో ముఖ్య భూమిక పోషిస్తున్నారు. నేషనల్ పైలట్స్ డే సందర్భంగా పలువురు పైలట్లను పలుకరించగా, వారి అనుభవం, అభిప్రాయాలను పంచుకున్నారు.
బాధితులను ఒక్కడినే షిఫ్ట్ చేస్తుంట
మారుమూల ప్రాంతాల్లో విధులు నిర్వహించే సమయంలో ప్రమాదం జరిగినా ఎవరూ సహాయం చేసేవారు ఉండరు. అలాంటి సందర్భాల్లో బాధితులను ఒక్కన్నే స్వయంగా ఘటనా స్థలి నుంచి అంబులెన్స్లోకి షిఫ్ట్ చేస్తుంట. ప్రస్తుతం సిరిసిల్లలో విధులు నిర్వహిస్తున్న. నా సేవలను గుర్తించిన ప్రభుత్వం ఉత్తమ పైలట్గా అవార్డులు కూడా అందించింది.
– ఎడ్ల మనోహర్
రాత్రింబవళ్లు విధులు
గత 15 ఏళ్లుగా 108 అంబులెన్స్ వాహనం నడుపుతున్న. జగిత్యాల ప్రాంతం నేషనల్ హైవే కావడంతో చాలా ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. ఒకోసారి లారీలు ఢీకొని అందులో డ్రైవర్లు ఇరుకుపోయిన సందర్భాల్లో వారిని చాకచక్యంగా రక్షించి, వైద్యశాలకు తరలిస్తుంట. రాత్రింబవళ్లు విధులు నిర్వహిస్తూ, సేవలందిస్తుండగా ఉత్తమ పైలట్ అవార్డు అందుకున్న.
– కామ రవి
ఎంతో మందిని రక్షించా
గత దశాబ్దంన్నర కాలంగా 108లో డ్రైవర్గా విధులు నిర్వహిస్తున్న. ప్రస్తుతం రామగుండం ఏరియాలో చేస్తున్న. రైల్వే ట్రాక్లపై జరిగిన ప్రమాదాల్లో క్షతగాత్రులను పలుమార్లు రక్షించిన. అప్పుడప్పుడు రైలు ప్రమాదంలో రైల్వే ట్రాక్పై పడి చేతులు కాళ్లు తెగి పడిన వారిని ఎంత దూరమైనా అంబులెన్స్ వరకు మోసుకుని వచ్చి వైద్యశాలకు తరలిస్తుంట. ఉత్తమ పైలెట్గా అవార్డులు అందుకున్న.
– ఆకుల రాజేందర్, పెద్దపల్లి జిల్లా పైలట్