ప్రతి ఎస్సీ కుటుంబానికీ దళితబంధు
లబ్ధిదారుల ఖాతాల్లో 10లక్షల చొప్పున జమ
కలెక్టర్ ఖాతాలోకి 1,500 కోట్లు
రెండు మూడు రోజుల్లో మరో 500 కోట్లు
సీఎంవో కార్యదర్శి రాహుల్ బొజ్జా
సర్వే వివరాలు వెల్లడించిన కలెక్టర్ కర్ణన్
కరీంనగర్, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ) : ఈ నెల 27 నుంచి హుజూరాబాద్ నియోజకవర్గంలో దళిత కుటుంబాల సర్వే చేస్తున్నామని, అందుకు సీనియర్ అధికారులను నియమించామని సీఎం కార్యాలయ కార్యదర్శి రాహుల్ బొజ్జా స్పష్టం చేశారు. ప్రతి రైతుకూ రైతుబంధు ఏ విధంగా వర్తిస్తుందో.. ప్రతి దళిత కుటుంబానికీ దళితబంధు అదే విధంగా వస్తుందని స్పష్టం చేశారు. పథకం అమలులో ఎలాంటి నిబంధనలు ఉండబోవని, లబ్ధిదారుల ఖాతాల్లో 10 లక్షల చొప్పున జమ చేస్తామని తెలిపారు. ఇందుకోసం కరీంనగర్ కలెక్టర్ ఖాతాలో ఇప్పటికే 1,500 కోట్లు జమ చేశామని, రెండు మూడు రోజుల్లో మరో 500 కోట్లు జమ చేస్తామని చెప్పారు. బుధవారం సాయంత్రం కరీంనగర్ కలెక్టరేట్లో కరీంనగర్, వరంగల్ అర్బన్ కలెక్టర్లు ఆర్వీ కర్ణన్, రాజీవ్ హన్మంతుతో కలిసి ఏరాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల కోసం ఇది వరకే సేకరించిన జాబితా తమ వద్ద ఉన్నదని, అయితే ఇప్పుడు కుటుంబాలు పెరిగిన నేపథ్యంలో మరోసారి సర్వే చేసి జాబితాను సిద్ధం చేస్తున్నామన్నారు.
సర్వేలో లబ్ధిదారులు ఎలాంటి యూనిట్లకు ప్రాధాన్యత ఇస్తున్నారనే వివరాలను కూడా సేకరిస్తున్నామని రాహుల్ బొజ్జా తెలిపారు. భూమి ఉన్న వాళ్లు ఎలాంటి యూనిట్లు పెట్టుకోవాలి, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో అయితే ఎలాంటి యూనిట్లు పెట్టుకోవాలనే వివరాలను నమోదు చేస్తామని చెప్పారు. ఆయా ప్రాంతాల్లో డిమాండ్ ఉన్న యూనిట్ల జాబితాను కూడా సిద్ధం చేశామని, అయితే లబ్ధిదారులకు ఇవి సూచనలు చేసేందుకు మాత్రమే అన్నారు. యూనిట్ల ఎంపిక విషయంలో అనుబంధ శాఖల అధికారులను కూడా లబ్ధిదారులకు సూచనలు, సలహాలు ఇచ్చేందుకు పంపిస్తున్నట్లు రాహుల్ బొజ్జా స్పష్టం చేశారు. సర్వే విషయంలో ఇప్పటికే క్లస్టర్ అధికారులు, జిల్లా స్థాయి అధికారులతో అవగాహన సమావేశాలు నిర్వహించి ఆదేశాలు ఇచ్చామన్నారు. టైం బాండ్ మోడ్లో పథకాన్ని అమలులోకి తెస్తున్నామని, మూడు నాలుగేళ్లు పర్యవేక్షిస్తామని పేర్కొన్నారు.
సర్వేలో 410 మందికి పైగా సిబ్బంది : కలెక్టర్
హుజూరాబాద్ నియోజకవర్గంలో నిర్వహించే దళిత బంధు సర్వే గురించి కలెక్టర్ ఆర్వీ కర్ణన్ వివరించారు. హుజూరాబాద్ నియోజకవర్గంలోని రెండు మున్సిపాలిటీలు, నాలుగు మండలాల్లో 350 మంది, కమలాపూర్లో 60 మంది చొప్పున మొత్తం 410 మందికి పైగా అధికారులు, సిబ్బంది పని చేస్తారని తెలిపారు. ఈ నెల 27 నుంచి సెప్టెంబర్ 2 లేదా 3 తేదీలోగా సర్వే పూర్తి చేస్తామన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో 21 వేల దళిత కుటుంబాలు ఉన్నాయని, డీటైల్ సర్వే కోసం స్థానికంగా ఉన్న దళిత కుటుంబాల సంఖ్యను బట్టి నాలుగైదు గ్రామాలకు ఒక జిల్లా స్థాయి అధికారిని నియమిస్తున్నామన్నారు. వీరి కింద మరో నాలుగైదు బృందాలు ఉంటాయన్నారు. ఈ బృందాలకు తహసీల్దార్, ఎంపీడీవో, ఎంపీవో స్థాయి అధికారులు నేతృత్వం వహిస్తారన్నారు. ఈ బృందాలు ప్రతి రోజూ 100 నుంచి 150 ఆపైన కుటుంబాలను సర్వే చేయాల్సి ఉంటుందన్నారు. సర్వేను 26 మంది జిల్లా స్థాయి అధికారులతో పాటు రాష్ట్ర స్థాయిలో డిప్యూటీ కలెక్టర్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ర్యాంక్ అధికారులు పర్యవేక్షిస్తారని చెప్పారు. సర్వేతోపాటు తెలంగాణ దళిత బంధు పేరుతో బ్యాంకుల్లో ప్రత్యేక ఖాతాలు తెరుస్తారని తెలిపారు.
ప్రతి మండలానికీ ఒక బ్యాంకును అలాట్ చేశామని, ఈ బ్యాంకులు ఆ మండలంలో ఉన్న అన్ని దళిత కుటుంబాలకు సంబంధించిన ఖాతాలను తెరుస్తాయని చెప్పారు. హుజూరాబాద్ రూరల్, మున్సిపాలిటీలో ఎస్బీఐ, ఇల్లందకుంటలో తెలంగాణ గ్రామీణ బ్యాంకు, వీణవంకలో కేడీసీసీ బ్యాంకు, జమ్మికుంట రూరల్లో ఎస్బీఐ, జమ్మికుంట మున్సిపాలిటీలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లేదా ఆంధ్రా బ్యాంకు, కమలాపూర్లో యూబీఐ ఖాతాలు తెరుస్తాయని కలెక్టర్ వివరించారు.