జగిత్యాల : రాష్ట్ర వ్యాప్తంగా హనుమాన్ చాలీసా పారాయణం జరగాలని కొండగట్టు అంజన్న సేవాసమితిని ఏర్పాటు చేశామని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు.
జిల్లాలోని కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయంలో ద్విమండల( 80 రోజులు) హనుమాన్ చాలీసా పారాయణం అంకురార్పణ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కవిత పాల్గొని మాట్లాడారు.
రాష్ట్ర వ్యాప్తంగా పదివేలకు పైగా దేవాలయాలతో పాటు, ప్రతి ఇంట్లో హనుమాన్ చాలీసా పారాయణం చేస్తామని ముందుకు రావడం సంతోషకరమన్నారు.
కొండగట్టు అంజన్న సన్నిధిలో జరిగే హనుమాన్ చాలీసా పారాయణాన్ని వివిధ మాధ్యమాల్లో ప్రత్యక్ష ప్రసారం చేయడం ద్వారా ప్రతి ఇంట్లోని భక్తులు పారాయణంలో పాల్గొంటారన్నారు. శాంతి, సౌభాగ్యంతో తెలంగాణ ప్రజలు సుభిక్షంగా ఉండాలనే ఈ బృహత్తర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ 80 రోజుల్లో ఆరు కోట్ల రామనామ లిఖిత ప్రతులను సిద్ధం చేసే కార్యక్రమంలో భక్తులందరూ భాగస్వాములవ్వాలని పిలుపునిచ్చారు. చెన్నై నుంచి సైతం రామనామ లిఖిత ప్రతులను తీసుకురావడం సంతోషకరమన్నారు. దీక్షలు చేసే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తామని ఎమ్మెల్సీ స్పష్టం చేశారు.