రాజన్నసిరిసిల్ల జిల్లా వైద్యారోగ్యశాఖ సర్వసన్నద్ధం
కరోనా కట్టడికి పకడ్బందీ చర్యలు
అందుబాటులో ఆక్సిజన్ నిల్వలు
జిల్లా దవాఖానలో 170 పడకలు సిద్ధం
పిల్లల కోసం 4 వెంటిలేటర్ల ఏర్పాటు
వంద శాతం వ్యాక్సినేషన్పై ప్రత్యేక దృష్టి
రాజన్న సిరిసిల్ల, డిసెంబర్ 5 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో క్రమేణా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాజన్నసిరిసిల్ల జిల్లా అధికార యంత్రాంగం వైరస్ను ఎదుర్కొనేందుకు సిద్ధమైంది. వైద్యారోగ్యశాఖ ఆధ్వరంలో కొవిడ్ కట్టడికి పకడ్బందీ చర్యలు చేపడుతున్నది. జిల్లా దవాఖానలో 170 ఆక్సిజన్ బెడ్లను అందుబాటులోకి తెచ్చింది. నవజాత శిశువుల నుంచి 19 ఏండ్లలోపు వయస్సు గల వారికోసం 4 వెంటిలేటర్లను కొనుగోలు చేసింది. ఈ నెలాఖరులోగా తొలి, రెండో డోసు వ్యాక్సినేషన్ను పూర్తిచేసేదిశగా ముందుకెళ్తున్నది. అలాగే కొవిడ్ నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారిపై కఠిన చర్యలకు ఉపక్రమిస్తున్నది. పోలీసు శాఖ సహకారంతో విరివిగా తనిఖీలు చేపట్టి మాస్క్లు ధరించని వారికి భారీగా జరిమానాలు విధించాలని నిర్ణయించింది. కలెక్టర్ అనురాగ్ జయంతి ఆధ్వర్యంలో శనివారం వైద్య, ఆరోగ్య, పంచాయతీరాజ్, అంగన్వాడీ తదితర శాఖల అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించి తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. దవాఖానల్లో అవసరం మేరకు అందుబాటులో ఉండేలా చూడాలని ఆదేశించారు.
అందుబాటులో ఆక్సిజన్
కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఆక్సిజన్ కొరత లేకుండా చూస్తున్నారు. జిల్లాలోని 13 మండలాలకు చెందిన వారే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి చికిత్స కోసం చాలా మంది సిరిసిల్ల దవాఖానకు వస్తుంటారు. ఇందుకు అనుగుణంగా వైద్యాధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం 6 వేల క్యూబిక్ లీటర్లు, కేంద్రం నిమిషానికి 500 క్యూబిక్ లీటర్లు ఉత్పత్తి చేసే ఆక్సిజన్ ప్లాంట్లను మంజూరు చేశాయి. వీటికి తోడు నిమిషానికి 170 లీటర్లు ఉత్పత్తి చేసే ఆక్సిజన్ ప్లాంట్ను మంత్రి కేటీఆర్ ప్రత్యేకంగా మంజూరు చేయించారు. 102 ఆక్సిజన్ సిలిండర్లను అందుబాటులో ఉంచారు. మందులు, ఇంజక్షన్లను సిద్ధం చేశారు. అలాగే వేములవాడ ఏరియా దవాఖానలో 15 బెడ్లను సిద్ధం చేశారు.
పిల్లలకు ప్రత్యేక వార్డు..
కరోనా వ్యాధి బారిన పడ్డ అప్పుడే పుట్టిన బిడ్డతో పాటు 19 ఏళ్ల వయసు గల పిల్లలకు మెరుగైన వైద్యం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. వీరి కోసం 4 వెంటిలేటర్లు కొనుగోలు చేశారు. హెచ్ఎఫ్ఎన్సీ 2, సీపాప్ 2 పరికరాలను సమకూర్చారు. దవాఖానలో వేగంగా కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. పాజిటివ్గా తేలిన వారిని దవాఖానకు తరలించి మెరుగైన వైద్యం అందించేందుకు ఏర్పాట్లు చేశారు.
వ్యాక్సిన్పై అవగాహన
వ్యాక్సిన్ అవశ్యకతపై జిల్లా ప్రజలకు వైద్యారోగ్యశాఖ అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 4 లక్షల 22వేల 182 మందికి వ్యాక్సిన్ వేయాలన్నది లక్ష్యంగా కాగా ఇప్పటి వరకు 3 లక్షల 90వేల 182 మందికి తొలిడోసు వేశారు. లక్షా 85వేల 710 మందికి రెండో డోసు వేసినట్లు అధికారులు తెలిపారు. ఈ నెలాఖరులోగా వంద శాతం పూర్తి చేసే లక్ష్యంతో ఆరోగ్య సిబ్బంది, ఆశ కార్యకర్తలు, స్వశక్తి సంఘాల మహిళలు ఇంటింటికీ వెళ్లి వ్యాక్సిన్ వేస్తున్నారు.
సమర్థవంతంగా ఎదుర్కొంటాం..
కరోనా మూడో వేవ్ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం. 170 ఆక్సిజన్ బెడ్లను అందుబాటులో ఉంచినం. మంత్రి కేటీఆర్ ఎప్పటికప్పుడు పరిస్థితిని తెలుసుకుంటున్నరు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. కరోనా నిబంధనలను కచ్చితంగా పాటించాలి.
-డాక్టర్ మురళీధర్రావు, జిల్లా ఏరియా దవాఖాన సూపరిండెండెంట్, రాజన్న సిరిసిల్ల