నాలుగుదశాబ్దాల కింద ఏర్పాటు
ఎందరో విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దిన విద్యాలయం
ఆరేండ్లుగా హెచ్ఎం, ఉపాధ్యాయుల కృషితో మరింత ప్రగతి
పదిలో వంద శాతం ఉత్తీర్ణత
ట్రిపుల్ ఐటీలో ఎందరో విద్యార్థులకు సీట్లు
కిచెన్, రాక్, ఫ్లవర్, ఫ్రూట్ గార్డెన్ల ఏర్పాటుతో ఆహ్లాదకర వాతావరణం
ఇటీవలే సీఎం కేసీఆర్ ప్రశంసలు
ధర్మారం, డిసెంబర్5;అది ధర్మారం మండలం పత్తిపాక ప్రభుత్వ పాఠశాల. నాలుగు దశాబ్దాల చరిత్ర కలిగిన విద్యాలయం. ఎందరికో ఓనమాలు నేర్పి మహామహులుగా తీర్చిదిద్దిన సరస్వతీ నిలయం ఇప్పుడు మరింత ప్రగతిని సాధించింది. హెచ్ఎం పీఎం షేక్, టీచర్ల కృషితో నాలుగేండ్లుగా పదోతరగతిలో వందశాతం ఉత్తీర్ణత సాధించడమే కాదు బాసరలో ట్రిపుల్ ఐటీ సీట్లను దక్కించుకుంటున్నది. మరోవైపు కిచెన్, రాక్, ఫ్లవర్, ఫ్రూట్ గార్డెన్ల ఏర్పాటుతో పచ్చని బడిగా మారి ఆహ్లాదకర వాతావరణాన్ని అందిస్తున్నది. ఇటీవలే సీఎం కేసీఆర్ ప్రశంసలు కూడా అందుకొని జిల్లాలోనే తోటి పాఠశాలలకు ఆదర్శంగా నిలుస్తున్నది.
పత్తిపాక పాఠశాల 1965లో ఏర్పాటైంది. గుట్ట బోరు ప్రాంతంలో నిర్మితమైంది. ధర్మారం మండలంతోపాటు పక్కనే ఉన్న పెగడపల్లి మండలంలోని పలు గ్రామాలకు చెందిన విద్యార్థుల కోసం ఏర్పాటు చేశారు. ఈ పాఠశాల 1973లోనే హైస్కూల్గా అప్గ్రేడ్ కాగా, ఇక్కడ చదివిన ఎందరో మంది విద్యార్థులు ఉన్నతస్థానాలకు ఎదిగారు. ఇప్పటి వరకు స్కూల్లో పదో తరగతి 40 బ్యాచ్లు పూర్తిచేసుకొని ఓల్డ్ స్కూల్గా గుర్తింపు పొందింది. కాలక్రమేణా మళ్లీ ప్రాథమిక, ఉన్నత పాఠశాలలుగా విడిపోయి పక్కపక్కనే కొలువుదీరాయి. సమీప గ్రామాల ప్రజలకు మంచి విద్యనందిస్తున్నాయి. స్కూల్లో ప్రస్తుతం 175 మంది విద్యార్థులు అభ్యసిస్తున్నారు. అయితే గతంలో తెలుగు, ఆంగ్ల మాధ్యమం వేర్వేరుగా ఉండడం వల్ల గదులు సరిపోకపోగా, గుట్టబోరుపై ఉన్న పాత ప్రాథమిక పాఠశాలను తొలగించి, చదును చేయించారు. నాలుగు అదనపు గదులు కట్టించారు. విశాలమైన ఆట స్థలం కూడా ఉండడంతో విద్యార్థులు జాతీయ, రాష్ట్ర స్థాయి పోటీల్లో సత్తాచాటుతున్నారు.
కొత్త రూపు
విద్యలోనే ఇతర అంశాల్లోనూ పాఠశాల ఆదర్శంగా నిలుస్తున్నది. ముఖ్యంగా 2015లో హెచ్ఎంగా వచ్చిన పీఎం షేక్ కృషి, టీచర్లు ఎస్ ఆనందం, బీ భాగ్య, జీ వినోద, పీ సాధన, ఎన్ చైతన్య, ఏ శారద, డీ శంకరయ్య, టీ సంధ్య, జీ శ్రీనివాస్, ఎల్ రాజమణి, పీఈటీ బీ సత్యనారాయణ సహకారంతో కొత్తరూపు సంతరించుకున్నది. ఎందుకు పనిరాని గుట్టబోరు నేడు ఉద్యాన వనాన్ని తలపిస్తున్నది. బర్త్డే గార్డెన్తో పాటు కిచెన్, ఫ్లవర్, ఫ్రూట్ గార్డెన్లను అభివృద్ధి చేశారు. ముఖ్యంగా బోరుపై రాళ్లతో అందంగా తీర్చిదిద్దిన రాక్ గార్డెన్ చూపరులను ఆకట్టుకుంటున్నది. పండ్ల మొక్కలు వృక్షాలుగా ఎదిగి కాయలు కాస్తుండగా, కిచెన్ గార్డెన్లో పండిన కూరగాయలతో పిల్లలకు మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు. ఇక విద్యార్థినుల్లో రక్త హీనత నివారణకు హెచ్ఎం వినూత్న ఆలోచన చేశారు. మధ్యాహ్న భోజనంతో కరివేపాకు పొడిని అందిస్తున్నారు. ఇక హరితహారం కింద స్కూల్లో పెద్ద సంఖ్యలో మొక్కలు నాటారు. అయితే ప్రత్యేక కార్యక్రమాల నిర్వహణ, పలు రకాల గార్డెన్ల అభివృద్ధి గురించి తెలుసుకున్న సీఎం కేసీఆర్ గతేడాది హైదరాబాద్లో జరిగిన సమీక్షలో పాఠశాల, హెచ్ఎం పీఎం షేక్ పేరును ప్రస్తావిస్తూ ప్రశంసించారు.
వందశాతం ఉత్తీర్ణత..
ఉపాధ్యాయుల కృషితో పదో విద్యార్థులు 2017 నుంచి వంద శాతం ఫలితాలను సాధిస్తున్నారు. ఇప్పటి వరకు బడి నుంచి బాసర ట్రిపుల్ ఐటీలో 10 మంది విద్యార్థులు సీట్లు సాధించారు. విద్యార్థులు చదువే కాదు ఇతర అభ్యసన కార్యక్రమాల్లో సత్తాచాటుతున్నారు. 2019, 2021లో హైదరాబాద్లో జరిగిన కళోత్సవ్లో జాతీయ స్థాయిలో బహుమతులు సాధించారు.