జగిత్యాల, డిసెంబర్ 5: జగిత్యాల జిల్లాలో వానకాలం పంట సీజన్ 2021-22 సంవత్సరంలో ధాన్యం కొనుగోళ్లు సజావుగా నిర్వహించాలని కలెక్టర్ రవి అన్నారు. వానకాలంలో జిల్లాలో 2లక్షల 86వేల 357 ఎకరాల్లో వరి సాగు చేయగా, 5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అంచనా వేశామన్నారు. జిల్లావ్యాప్తంగా గత వానకాలంలో 30, 415 మంది రైతుల నుంచి లక్షా 91 వేల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయగా, ఈ సీజన్లో ఐకేపీ, పీఏసీఎస్, ఏఎంసీ ద్వారా 410 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. ధాన్యం మద్దతు ధర క్వింటాల్కు ఏ గ్రేడ్ రకానికి రూ.1960, బీ గ్రేడ్ రకానికి రూ.1940తో 30,415 మంది రైతుల నుంచి రూ.374.39 కోట్ల విలువ గల 1.91,017.820 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని తెలిపారు. రూ.228.38 కోట్ల విలువైన 1,16,522 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్ల వివరాలు ట్యాబ్ ఎంట్రీ పూర్తి చేయడంతోపాటు 1,73, 616 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మిల్లులకు తరలించి, ఆన్లైన్ ద్వారా రైతులకు 165.56కోట్లు(97శాతం) చెల్లింపులు జరిగేలా చేశామన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు వ్యవసాయశాధికారుల ద్వారా నాణ్యతా ప్రమాణాలు ధ్రువీకరించిన తర్వాతే ధాన్యా న్ని కొనుగోలు చేస్తున్నామన్నారు. తూకంలో ప్రభుత్వ ఆదేశాలకు మీరి ప్రవర్తిస్తే చట్టరీత్యా క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. కొన్ని చోట్ల వ్యవసాయ శాఖాధికారులు నాణ్యత ధ్రువీకరించని ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసి రైస్మిల్లులకు రవాణా చేసినట్లు గుర్తించామని, నాణ్యతా ప్రమాణాలు పాటించనట్లుగా గుర్తించిన 18 మండలాల్లోని 18 సెంటర్లలో తనిఖీ చేసి మూడు రోజులుగా నివేదికలు అందించాల్సిందిగా పౌరసరఫరా క్షేత్రస్థాయి సిబ్బందిని ఆదేశించామన్నారు. సెంటర్లవారీగా ఈనెల4న మిల్లుల వారీగా ప్రగతిని పరిశీలించగా కొడిమ్యాల, మేడిపల్లి, వెల్గటూర్, ధర్మపురి, గొల్లపల్లి, కోరుట్ల మండలాల్లోని 32 మిల్లులు ధాన్యం దిగుమతిలో వెనుకబడి ఉన్నందున వారికి నోటీసులు జారీ చేశామన్నారు. దిగుమతిని వేగవంతం చేయకపోతే తెలంగాణ కస్టం మిల్లింగ్ యాక్ట్ 2015 ప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. రైతులు ధాన్యాన్ని ఆరబెట్టుకుని, తాలు, తప్ప లేకుండా కొనుగోలు కేంద్రాలకు తీసుకొని రావాలని, కొనుగోళ్లలో ఎలాంటి ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని, సీఎం ఆదేశాల మేరకు వానకాలం పంట పూర్తి స్థాయిలో కొనుగోలు చేస్తామని స్పష్టం చేశారు. అలాగే, కొనుగోలు కేంద్రాలు, మిల్లుల వద్ద ఎవరైనా సమస్యలు సృష్టించి ఇబ్బందులకు గురి చేస్తే కాల్ సెంటర్కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని కలెక్టర్ రైతులకు సూచించారు.
బీర్పూర్ సహకార సంఘం ఆధ్వర్యంలో..
సారంగాపూర్, డిసెంబర్ 5: బీర్పూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఆదివారం వరకు 6,420 క్వింటాళ్లు కొనుగోలు చేసినట్లు సహకార సంఘం సీఈవో తిరుపతి తెలిపారు. సహకార సంఘం పరిధిలోని మోతీనగర్లో 900, తుంగూర్లో 1,600, చర్లపల్లిలో 1,950, కండ్లపల్లిలో 1,170, రంగసాగర్లో 800 క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేసినట్లు పేర్కొన్నారు. రైతుల కు డబ్బులు వెంటవెంటనే చెల్లిస్తున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు.