ఓదెల, డిసెంబర్ 5: నిరుపేద కుటుంబానికి చెందిన ఇంటి యజమాని మృతి చెంది పరిస్థితి దయనీయంగా ఉన్న విషయాన్ని గమనించిన యువకులు వాట్సాప్ గ్రూప్ ద్వారా డబ్బులు జమ చేసి మానవత్వాన్ని చాటుకున్నారు. కనగర్తికి చెందిన ఆడెపు బాణయ్య(65) ఇటీవల అనారోగ్య కారణాలతో మృతి చెందాడు. అతడికి ముగ్గురు కూతుళ్లు. కుటుంబ ఆర్థిక పరిస్థితి దయనీయంగా ఉంది. స్థానిక యువకులు ఈ విషయాన్ని గమనించారు. ‘యువ కెరటాలు’ వాట్సా ప్ గ్రూప్లో పోస్ట్ చేసి సాయమందించాలని కోరారు. దీంతో రూ.20 వేలు జమ అయ్యాయి. ఆ డబ్బులను పోస్టాఫీస్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేసి బాండ్ను బాణయ్య కూతురుకు ఆదివారం అందజేశారు. యువకులను గ్రామస్తులు అభినందించారు. కార్యక్రమంలో దాసరి హన్మయ్య, కోటగిరి నరేందర్, కసిరెడ్డి మహేందర్, ఆది సతీశ్, రామగిరి రాజు, ఆడెపు సదానందం, రమేశ్, నిఖిల్ తదితరులు పాల్గొన్నారు.
నిరుపేద యువతి వివాహానికి సాయం
నంది మేడారానికి చెందిన నిరుపేద యువతి బోరె శ్రీలత వివాహానికి మంత్రి కొప్పుల ఈశ్వర్ నేతృత్వంలోని ఎల్ ఎం కొప్పుల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సాయాన్ని అందించారు. శ్రీలత తల్లిదండ్రులు ఎల్లమ్మ, మల్లయ్య. వారిలో మల్లయ్య మరణించాడు. శ్రీలతకు వివాహం నిశ్చయం కావడంతో సాయం అందించాలని టీఆర్ఎస్ నాయకులు ట్రస్ట్ చైర్ పర్సన్ కొప్పుల స్నేహలతను కోరారు. దీంతో స్నేహలత రూ.10వేలు, నూతన వస్ర్తాలు పంపించడంతో ఆదివారం పార్టీ నాయకులు యువతికి అందించారు. సాయం చేసిన మంత్రి దంపతులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ సామంతుల జానకి, జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు ఎండీ బాబా, విండో వైస్ చైర్మన్ సామంతుల రాజమల్లు, ఉప సర్పంచ్ కట్ట రమేశ్, ఆర్బీఎస్ గ్రామ కోఆర్డినేటర్ నేరెళ్ల లచ్చయ్య, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రాచూరి శ్రీధర్, సోషల్ మీడియా మండలాధ్యక్షుడు దేవి నళినీకాంత్, ప్రచార కార్యదర్శి సిరికొండ లింగయ్య, గ్రామ శాఖ పార్టీ అధ్యక్షుడు రాచూరి రాజ్కుమార్, నాయకులు సత్తయ్య, పుర్ర గంగయ్య, సాన రాజేందర్, ఆవుల రాజయ్య, బొడ్డు రమేశ్, నడిమెట్ల ప్రవీణ్, ఎండీ రహీం పాల్గొన్నారు.