కోరుట్ల, డిసెంబర్ 5: కోరుట్ల పట్టణంలోని కల్లూరు రోడ్డులో ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న భౌతిక శాస్త్రం ఉపాధ్యాయుడు చంద నాగరాజుకు అరుదైన గౌరవం దక్కింది. ఆదివారం ఢిల్లీలోని ఇండియా హాబిటెడ్ సెంటర్లో జరిగిన ఆజాదీ కా డిజిటల్ మహోత్సవ్ కార్యక్రమంలో చేంజ్ మేకర్ బ్యాడ్జితోసహా ప్రశంసా పత్రాన్ని కేంద్ర సాంస్కృతిక శాఖ సహాయ మంత్రి మీనాక్షీ లేఖి చేతుల మీదుగా అందుకున్నారు. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా ప్రారంభించిన ఆజాదీ కా డిజిటల్ మహోత్సవ్ కార్యక్రమానికి జాతీయ స్థాయిలో 75 మందికి ఆహ్వానం అందగా, కోరుట్లకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు నాగరాజు అందులో ఒకరుగా నిలిచిన విషయం విదితమే. స్వచ్ఛభారత్, హరితహారం, యోగా, ఇంధన వనరుల పొదుపు, విజ్ఞాన విహారయాత్రలు, స్కౌటింగ్కు సంబంధించిన వీడియోలు, ఛాయాచిత్రాలతో పాటు వివిధ అంశాలపై my.gov.inలో పొందుపరిచి, గ్రూప్ డిస్కషన్, టాస్క్లో పాలుపంచుకొని జాతీయ స్థాయిలో అత్యధిక పాయింట్లు సాధించడంతో నాగరాజు చేంజ్ మేకర్ బ్యాడ్జికి ఎంపికయ్యాడు. నాగరాజుకు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గడెల భూపతి, తోటి ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు.