రాంనగర్, డిసెంబర్ 5: నేరాల నియంత్రణకే కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నట్లు అడిషనల్ డీసీపీ (ఎల్అండ్వో) శ్రీనివాస్ తెలిపారు. సీపీ వీ సత్యనారాయణ ఆదేశాల మేరకు కొత్తపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని చింతకుంట, శాంతినగర్ ప్రాంతాల్లో ఆదివారం పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఉదయం 5 నుంచి 7 గంటల వరకు అనుమానిత ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ, కమిషనరేట్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ ప్రాంతంలో గతంలో ఎన్నో అసాంఘిక చర్యలు జరిగిన దృష్ట్యా నిర్బంధ తనిఖీలు చేపట్టినట్లు పేర్కొన్నారు. ప్రజలకు రక్షణ, భద్రతపై భరోసా కల్పించేందుకు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజలను ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం లేదని పేర్కొన్నారు. వాహనదారులు వాహనాల నంబర్ ప్లేట్లు ట్యాంపరింగ్ చేయవద్దని, రోడ్డు నియమ నిబంధనలను పాటించకపోతే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. నేరాల ఛేదన, నియంత్రణకు దోహదపడే సీసీ కెమెరాల ఏర్పాటుకు అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా ముందుకురావాలని కోరారు. స్మార్ట్ ఫోన్ ఉన్న వారు హ్యాక్ ఐ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. ఈసందర్భంగా 200 మందితో హ్యాక్ ఐ యాప్ను డౌన్లోడ్ చేయించారు. సరైన ధ్రువీకరణ పత్రాలు లేని 73 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. పత్రాలను తీసుకువచ్చి వాహనాలను తీసుకెళ్లాలని సూచించారు. కార్యక్రమంలో కరీంనగర్ రూరల్ ఏసీపీ విజయసారథి, ఇన్స్పెక్టర్ నాగేశ్వర్రావు, ఎస్ఐ ఎల్లాగౌడ్, వివిధ స్థాయిల పోలీసులు పాల్గొన్నారు.