అంధత్వమున్నా ఆత్మవిశ్వాసంతో ముందుకు..
గ్రూప్-4 ఉద్యోగం నుంచి మండలాభివృద్ధి అధికారి దాకా..
టెక్నాలజీ సహాయంతో విధుల నిర్వహణ
పెద్దపల్లి, డిసెంబర్ 4 (నమస్తేతెలంగాణ) : కరీంనగర్ జిల్లాకేంద్రంలోని సంతోష్నగర్కు చెందిన కలికోట శ్రీనివాస్ పాక్షిక దృష్టిలోపంతో జన్మించాడు. తండ్రి నర్సింహాచారి వెటర్నరీ లైవ్ స్టాక్ అసిస్టెంట్గా పనిచేసేవాడు. తల్లి భాగ్యలక్ష్మి గృహిణి. ఎనిమిదో తరగతి మధ్యవరకు చూపు మామూలుగానే ఉండేది. అప్పుడే గ్లకోమా బారినపడడంతో పూర్తిగా అంధత్వం అలుముకున్నది.అయినా కుంగిపోలేదు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో కరీంనగర్లోని అంధుల ఆశ్రమ పాఠశాలలో బ్రెయిలీ లిపిలో 8వ తరగతి చదివాడు. 10వ తరగతి అదే స్కూళ్లో పూర్తి చేశాడు. ఇంటర్ కరీంనగర్లోని బిషప్ సాల్మన్ జూనియర్ కళాశాలలో సాధారణ విద్యార్థులతో కలిసి చదువుకున్నాడు. అధ్యాపకులు చెప్పే పాఠాలను టేప్ రికార్డర్లో రికార్డ్ చేసుకొని ఇంటికి వచ్చి వాటికి బ్రెయిలీ లిపిలో నోట్స్ రాసుకునే వాడు. నోటు పుస్తకాల్లో ఉన్న సిలబస్ను చెల్లెలు ధనలక్ష్మి నోట్స్లో ఉన్న వాటిని చెబితే బ్రెయిలీ లిపిలోకి తర్జుమా చేసుకొనేవాడు. అలా వాటిని చదువుకొని పరీక్షలకు హాజరయ్యాడు.
ఇంటర్ పూర్తయ్యాక 1997లో ప్రభుత్వం శారీరక వికలాంగులకు గ్రూప్-4 పరీక్ష నిర్వహించింది. అందులో మెరిట్-1లో పాసై జూనియర్ అసిస్టెంట్ పోస్టుకు దరఖాస్తు చేసుకోగా ఉద్యోగం లభించింది. ఫస్ట్ పోస్టింగ్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని మహాదేవపూర్ మండల జడ్పీ హైస్కూల్లో చేరాడు.. అదే సమయంలో సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు గ్రామానికి చెందిన కళావతితో శ్రీనివాస్ వివాహం జరిగింది. వీరికి కొడుకు మణిదీప్, కూతురు శివదీపిక ఉన్నారు. ఆ తర్వాత కరీంనగర్ మండలం బోయినపల్లి, తిమ్మాపూర్ మండలం ఎల్ఎండీ జడ్పీహెచ్ఎస్లో పనిచేశాడు. ఈ సమయంలో జిల్లా కేంద్రానికి దగ్గరగా ఉండటంతో అక్కడ అంధ ఉద్యోగుల సంఘం విజువల్లీ చాలెంజ్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ బ్రాంచ్ ఏర్పాటు చేసి ఆ సంఘానికి ప్రధాన కార్యదర్శిగా సేవలందించాడు. 2013లో సీనియర్ సహాయకుడిగా ఉద్యోగోన్నతిపై కాల్వశ్రీరాంపూర్ ఎంపీడీవో కార్యాలయానికి వెళ్లాడు. అక్కడ నాలుగేండ్లు పనిచేసిన అనంతరం 2017లో సూపరింటెండెంట్గా ఉద్యోగోన్నతిపై మంథని ఎంపీడీవో కార్యాలయానికి వెళ్లాడు. 2019లో అక్కడి నుంచి సంగారెడ్డి జిల్లా నాగల్గిద్ద మండల ప్రజా పరిషత్లో తొలిసారిగా ఎంపీడీవోగా పనిచేశాడు. 2021లో అక్కడి నుంచి ముత్తారం ఎంపీడీవోగా నియమితులయ్యాడు.
సాంకేతికతతో విధి నిర్వహణ..
విధి నిర్వహణలో శ్రీనివాస్కు అంధత్వం అడ్డురాలేదు. సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని ఇబ్బందిలేకుండా పనిచేస్తున్నాడు. ప్రతీ మొబైల్ ఫోన్లో ఉండే ‘టాక్ బ్యాక్’అనే అప్లికేషన్ ఆధారంగా సెల్ఫోన్లోని ఫైల్స్, ఫోన్బుక్లోని పేర్లు చదవడానికి ఉపయోగిస్తున్నాడు. అదే విధంగా మొబైల్లో ‘ఎలిక్వెన్స్, వాయిస్లైజర్’అనే రెండు యాప్లతో మొబైల్ఫోన్ ఆపరేట్ చేస్తుండగా జాస్ రీడింగ్ సాప్ట్వేర్ ద్వారా కంప్యూటర్ను ఆపరేట్ చేస్తున్నాడు.