కలెక్టరేట్, డిసెంబర్ 6: ఆరుతడితో అధిక ఆదాయం వస్తుంద ని, యాసంగిలో రైతులు వరికి బదులుగా ఇతర పంటలు సాగు చేసేలా క్షేత్ర స్థాయిలో అధికారులు అవగాహన కల్పించాలని కలెక్టర్ అనురాగ్ జయంతి అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో వ్యవసాయ అధికారులతో సమావేశమై, మాట్లాడారు. యాసంగిలో ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసే అవకాశం లేదని రైతులకు తేల్చిచెప్పాలన్నారు. వరికి బదులుగా వేరుశనగ, మినుములు, శనిగలు, పెసర్లు, నువ్వులు, దనియాలు, ఆముదాలు, ఆవాలు, బబ్బెర్లు, కుసుమలు, పొద్దు తిరుగుడు సాగు చేసేలా అవగాహన కల్పించాలని సూచించారు. రైతు సమూహాలతో గ్రామ స్థాయి సమావేశాలు ఏర్పాటు చేసి, పంట వైవిద్యంపై చైతన్యం తేవాలన్నారు. అనంతరం యాసంగిలో వరికి బదులుగా ఇతర పంటల సాగుపై రూపొందించిన వాల్పోస్టర్ను కలెక్టర్ ఆవిష్కరించారు.
సిరిసిల్ల రూరల్, డిసెంబర్ 6: యాసంగిలో ఇతర పంటలను సాగు చేయాలని సిరిసిల్ల ఏఈవోలు సుచరిత, వర్షిణి మున్సిపల్ పరిధిలోని పెద్దూరులో రైతులకు అవగాహన కల్పించారు. ఇక్కడ పలువురునాయకులు, రైతులు ఉన్నారు.
ఆరుతడి పంటల సాగుపై పలు గ్రామాల్లో రైతులకు ఏఈవోలు అవగాహన కల్పించారు. పప్పు దినుసులు, నూనె గింజల పంటలను సాగు చేయాలన్నారు. మం డల కేంద్రంతోపాటు మల్లారెడ్డిపేట, దమ్మన్నపేట, గజసింగవరం, నర్మాల, లింగన్నపేట గ్రామాల్లో నిర్వహించిన సదస్సులో ఏఈవోలు నవీద్, ప్రవీణ్, రాకేశ్, సాయి, శ్వేత, గౌతమి ఉన్నారు.
డిమాండ్ ఉన్న పంటలు వేయాలి: ఏడీఏ
మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను రైతులు యాసంగిలో సాగులో చేయాలని ఏడీఏ భాస్కర్ కోరారు. సోమవారం ఆయన బోయినపల్లిని రైతుల వేదికలో పంటల సాగుపై రైతులకు నిర్వహించిన అవగాహన సదస్సుకు హాజరై మాట్లాడారు. వరికి బదులుగా ఇతర పంటలు సాగు చేస్తే మార్కెట్లో డిమాండ్ ఉంటుందన్నారు. నూనె గింజలు, పప్పుదినుసులు సాగు చేయాలని కోరారు. ఇక్కడ ఏవో ప్రణీత, రైతులు తదితరులు ఉన్నారు.
పంట మార్పిడి తప్పనిసరి
రైతులు తప్పనిసరిగా పంట మార్పి డి చేసి అధిక దిగుబడులు పొందాలని ఏఈవోలు రవళి, గంగ కోరారు. సోమవారం వారు ముస్కానిపేట, కేశన్నపల్లి, రేపాక, గొల్లపల్లి, వెంకట్రావుపల్లి గ్రామాల్లో పంట మార్పిడి పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించారు. యేటా పంట మార్పిడి చేస్తే అధిక దిగుబడి రావడంతోపాటు చీడపీడల బాధ తగ్గుతుందన్నారు. పప్పు దినుసులు, నూనె గింజల పంటలను సాగు చేయాలని కోరారు. ఇక్కడ సర్పంచులు ఎలుక లక్ష్మి, పోతరాజు ఎల్లవ్వ, మంద సుశీల, ఏఎంసీ డైరెక్టర్ కడగండ్ల తిరుపతి, రైతులు తిరుపతి రెడ్డి, స్వామి, నర్సయ్య తదితరులు ఉన్నారు.
మండల కేంద్రంతోపాటు మానాలలో రైతులకు పంట మార్పిడిపై ఏవో అనూష అవగాహన కల్పించారు. ఇక్కడ ఏఈవో రోచన, జక్కు మోహన్, రైతులుపాల్గొన్నారు.
కోనరావుపేట, డిసెంబర్ 6: రైతులు యాసంగిలో వరికి బదులుగా ఆరుతడి పంటలను సాగు చేయాలని ఏఈవోలు కోరారు. సోమవారం వారు బావుసాయిపేట, కొలనూర్, సుద్దాల, పల్లిమక్త, నిజామాబాద్, కోనరావుపేట, శివంగాళపల్లి గ్రామాలలోని రైతులకు అవగాహన కల్పించారు. ఇక్కడ ఏవో వెంకట్రావమ్మ, ఏఈవోలు శివ, జాహెద్, నరేశ్, పద్మ, హేమాజీ ఉన్నారు.