బెంగళూరు: కర్ణాటకలో కరోనా పరిస్థితిపై అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రిపై మండిపడ్డారు. పేదలను రక్షించలేని వారు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దావనగెరేకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే ఎంపీ రేణుకాచార్య, సొంత అధికార పార్టీకి చెందిన ఆరోగ్య మంత్రి కే సుధాకర్పై గురువారం విమర్శలు గుప్పించారు. బెంగళూరు నగర పాలిక పరిధిలో కరోనా రోగులకు బెడ్ల కొరతపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంతమంది పదవులు పొంది ఎంజాయ్ చేస్తున్నారని, పేదలను రక్షించడానికి కట్టుబడి లేరని ఆరోపించారు. వారు పని చేయలేకపోతే తమ పదవికి రాజీనామా చేయాలని రేణుకాచార్య డిమాండ్ చేశారు.
కర్ణాటకలో గత కొన్ని రోజులుగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నది. బుధవారం రికార్డుస్థాయిలో రోజువారీ కేసుల నమోదు 50 వేలు దాటింది. రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 20 లక్షలు, మరణాల సంఖ్య 17 వేలకు చేరింది.