సిటీబ్యూరో, జూన్ 7 ( నమస్తే తెలంగాణ ) : థర్డ్ వేవ్.. ఇప్పుడు ఎవరినోట విన్నా ఇదే మాట. కరోనా మహమ్మారి రూపాంతరం చెంది మూడో దశ రూపంలో దాడికి రాబోతుందనే భయం అందరిలోనూ నాటుకుపోయింది. ముఖ్యంగా తల్లిదండ్రుల్లో గుబులు పుట్టిస్తున్నది. పిల్లలపై ఎక్కువ ప్రభావం చూపనుందని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో తమ పిల్లలు మహమ్మారి బారినపడకుండా కొందరు తల్లిదండ్రులు ఇప్పటి నుంచే సమాయత్తమవుతున్నారు. కొందరైతే తమ పిల్లలను ముప్పు పోయే వరకు ఊళ్లకు పంపించాలనే ఆలోచనలో ఉన్నారు. మరికొందరు గ్రామాల బాట పడుతున్నారు. ఇంకొందరు సోషల్ మీడియా వేదికగా.. వాట్సాప్ గ్రూపులను ఏర్పాటు చేసుకొని.. తమ ఫ్యామిలీ వైద్యులతో సలహాలు సూచనలు తీసుకుంటున్నారు. అందులో చిల్డ్రన్స్ స్పెషలిస్ట్లు, పేరెంట్స్ అడ్మిన్లుగా ఉంటున్నారు. పిల్లలకు ఎలాంటి సమస్య వచ్చినా.. అందులో వైద్యులను సంప్రదిస్తున్నారు. కొందరు వైద్యులు వీడియో కాలింగ్లో అందుబాటులోకి వచ్చి టెలి కన్సల్టేషన్ సేవలందిస్తున్నారు.
థర్డ్ వేవ్ ఎలా ఉంటుంది అనేది ఇప్పటికీ స్పష్టత లేదు. కానీ దాని ప్రభావం చిన్నారులపై ఉంటుందని తెలిసింది. అందుకే కొవిడ్ మూడో దశకు సంబంధించిన ప్రతి వెబినార్లో పాల్గొని విషయాలను తెలుసుకుంటున్నా. వాట్సాప్ గ్రూప్లోని వైద్యుల సూచనలు పాటిస్తున్నాం. కరోనా ఆపత్కాలంలో సోషల్ మీడియా రోల్ చాలా కీలకంగా ఉంది. ఏ సమయంలోనైనా చిన్నారులకు సంబంధించి ఏ సమస్య వచ్చినా.. వెంటనే మా గ్రూపు సభ్యులు స్పందిస్తున్నారు. ఇలాంటి గ్రూపులు మా ఫ్రెండ్స్ సర్కిల్లో ఏర్పాటు చేసుకుంటున్నాం. ప్రతి ఒక్క పేరెంట్ అత్యంత జాగ్రత్తగా ఉండాలి.- బాలకుమార్, వాట్సాప్ గ్రూప్ అడ్మిన్.
థర్డ్ వేవ్లో చిన్నారులపై వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటుందని తెలిసింది. అయితే అది ఏ స్థాయిలో ఉంటుంది..? ఎలాంటి సమస్యలు వస్తాయి..? పరిష్కార మార్గం ఏమిటీ ? అని ఒక పేరెంట్గా నాకు ఆలోచన కలిగింది. అందుకే సుమారు 25 మంది పిడియాట్రిషన్స్, వంద మంది పేరెంట్స్తో కొవిడ్-19 పిడియాట్రిక్ ఓన్లీ అనే వాట్సాప్ గ్రూప్ను ఏర్పాటు చేశాను. ప్రతిరోజూ గ్రూపులో ఉన్న వైద్యులు థర్డ్ వేవ్కు సంబంధించిన విషయాలపై తల్లిదండ్రులకు కు అవగాహన కల్పిస్తున్నారు. పిల్లలకు ఎలాంటి సమస్యలు వచ్చినా.. అందులో పోస్ట్ చేస్తున్నారు. వైద్యులు చికిత్స వివరాలు చెబుతున్నారు. – శ్రీధర్ మెరుగు, కొవిడ్-19 పిడియాట్రిక్స్ వాట్సాప్ గ్రూప్ అడ్మిన్.
చాలా మంది నన్ను వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తున్నారు. పేరెంట్స్ వారి సందేహాలను గ్రూప్ వేదికగా అడుగుతున్నారు. మేం సమాధానాలిస్తున్నాం. చాలా మంది తల్లిదండ్రులకు థర్డ్వేవ్పై భయం ఉంది. అయితే అంతగా భయపడాల్సిన అవసరం లేదు. కొన్ని జాగ్రత్తలతో ఎలాంటి ముప్పునైనా ఎదుర్కోవచ్చు. పిల్లలపై కొవిడ్-19 తీవ్రత తక్కువగా ఉంటుంది. అనవసరంగా చిన్నారులను బయటకు తీసుకెళ్లకూడదు. కచ్చితంగా భౌతికదూరం పాటించాలి. శానిటైజర్, మాస్క్లు వినియోగించాలి. -డాక్టర్. సీవీ మదన్కుమార్, చిన్నపిల్లల వైద్య నిపుణులు
చిన్నపిల్లలకు విరోచనాలు, వాంతులు అయితే ఏం చేయాలి? జ్వరం వస్తే స్నానం చేయడం వల్ల ఏమవుతుంది? తదితర విషయాలపై వైద్యులు వివరంగా వీడియోల రూపంలో మా గ్రూప్లో పోస్ట్ చేస్తున్నారు. ప్రతిరోజూ ఏదో ఒక అంశంపై సూచనలు చేస్తారు. వాటిని మేం విధిగా ఫాలో అవుతాం. దీంతో ప్రతి పేరెంట్ కొంత ధైర్యంగా ఉండగలుగుతున్నాడు. కొవిడ్ సెకెండ్వేవ్లో పిల్లలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారో వైద్యులు వెబినార్లో సూచనలు చేస్తున్నారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తున్నారు. – రమేశ్, పిల్లల సంరక్షణ వాట్సాప్ గ్రూప్ అడ్మిన్