జిల్లాలోని ఎంపీపీల డిమాండ్
జగిత్యాల రూరల్, మార్చి 16: ఎంపీ అర్వింద్ వెంటనే రాజీనామా చేయాలని, నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని పసుపు రైతులు అడుగడుగునా ఆయనను అడ్డుకునేందుకు సిద్ధంగా ఉన్నారని జిల్లాలోని ఎంపీపీలు తెలిపారు. జిల్లాకేంద్రంలో వారు మంగళవారం సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, నిజామాబాద్లో పసుపు బోర్డు ఏర్పాటు చేసేది లేదని పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి స్పష్టం చేశారని, 2019 పార్లమెంట్ ఎన్నికల్లో అర్వింద్ పసుపు బోర్డు తెస్తానని రైతులకు బాండ్ పేపర్ రాసిచ్చారని గుర్తు చేశారు. ఎన్నికల సమయంలో కేవలం రాజకీయ లబ్ధికే తప్పుడు హామీలు ఇచ్చారని విమర్శించారు. ఎంపీ అర్వింద్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మాజీ ఎంపీ, ప్రస్తుత నిజామాబాద్ ఎమ్మెల్సీ కవిత పసుపు బోర్డు ఏర్పాటు చేసేందుకు ఎనలేని కృషి చేశారని గుర్తు చేశారు. సమావేశంలో ఎంపీపీలు గాజర్ల గంగారాంగౌడ్, లావుడ్యా సంధ్యారాణి, నక్క శంకరయ్య, మారు సాయిరెడ్డి, తోట నారాయణ, ఎడ్ల చిట్టిబాబు, గోలి శోభ, రేవతి, జమున, కాటిపెల్లి రాధ, తదితరులు పాల్గొన్నారు.