రఘునాథపాలెం, ఏప్రిల్ 20 : ఖమ్మం కార్పొరేషన్పై గులాబీ జెండా ఎగురడం ఖాయమని, టీఆర్ఎస్ పార్టీ గెలుపు చరిత్ర సృష్టిస్తుందని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా మంగళవారం ఆయన 4, 6, 7వ డివిజన్లలో ఎన్నికల ప్రచారంలో మంత్రి పాల్గొన్నారు. మొదట పార్టీ ప్రచారరథాలను ప్రారంభించారు. అనంతరం ఆయా డివిజన్లలోని టేకులపల్లి, లక్ష్మీనగర్, ఖానాపురం, ప్రశాంతినగర్, ఇండస్రియల్ ఏరియా, యూపీహెచ్ కాలనీల్లో ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా ఖానాపురం, యూపీహెచ్ కాలనీల్లో ఓటర్లను ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ.. ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో ఇతర పార్టీలకు గెలిచే అవకాశం ఇవ్వకుండా టీఆర్ఎస్ పార్టీ విజయ దుంధుభి మోగించాలన్నారు. ఇప్పటికే జిల్లాలో టీఆర్ఎస్ తిరుగులేని బలమైన రాజకీయ పార్టీగా అవతరించిందని స్పష్టంచేశారు. కార్పొరేషన్లోని 60 స్థానాలకు 60 టీఆర్ఎస్ ఖాతాలోకి చేరడం ఖాయమని చెప్పారు. కార్పొరేషన్ సమగ్రాభివృద్ధికి నిధులు తీసుకురావాల్సిన బాధ్యత తనదేనని నేతలకు భరోసానిచ్చారు. ప్రచారంలో వైరా మాజీ ఎమ్మెల్యే బానోత్ మదన్లాల్, మాజీ ఎంపీపీ దొంగల ఇందిర, మాజీ కార్పొరేటర్ ఆత్కూరి హనుమాన్ తదితరులు పాల్గొన్నారు.
పచారం రాత్రి 8 గంటల వరకే..
హైదరాబాద్, ఏప్రిల్ 20 (నమస్తే తెలంగాణ): రెండు కార్పొరేషన్లు, ఐదు మున్సిపాలిటీలతోపాటు ఖాళీగా ఉన్న స్థానాలకు జరుగుతున్న ఎన్నికల్లో ప్రచారం ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి 8 మధ్య మాత్రమే చేసుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘం మంగళవారం ప్రత్యేక ఉత్తర్వులు జారీచేసింది. రాష్ట్రంలో కరోనా వ్యాధి విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం రాత్రి కర్ఫ్యూ విధించింది. దీంతో రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రచార సమయాలను మార్చింది. ప్రచారంలో ఉపయోగించే లౌడ్ స్పీకర్లను బహిరంగ సభలు, రోడ్డు షోలలో ఉదయం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు మాత్రమే అనుమతిస్తామని స్పష్టంచేసింది. అలాగే మిగతా సమయాల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల మధ్యమాత్రమే లౌడ్స్పీకర్లకు అనుమతించింది.