శాన్ఫ్రాన్సిస్కో, అక్టోబర్ 31: ప్రముఖ సామాజిక మాధ్యమం ట్విట్టర్ను ఇటీవల కొనుగోలు చేసిన టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ కొత్త ఆదాయ మార్గాలపై దృష్టి సారిస్తున్నారు. దీనిలో భాగంగా ట్విట్టర్ వినియోగదారులకు షాక్ ఇవ్వబోతున్నారు. త్వరలో పెయిడ్ వెర్షన్ను అందుబాటులోకి తీసుకొచ్చి బ్లూటిక్ సహా ఇతర అదనపు ఫీచర్లపై ఒక్కో వినియోగదారుడి నుంచి నెలకు 19.99 డాలర్ల చొప్పున వసూలు చేయాలని యోచిస్తున్నారు.
నవంబర్ 7లోగా పెయిడ్ వెరిఫికేషన్ను ప్రారంభించాలని, లేకపోతే వెంటనే ఉద్యోగాలను వీడి వెళ్లిపోవాలని స్పష్టంచేస్తూ ట్విట్టర్ ఉద్యోగులకు ఎలాన్ మస్క్ తొలి గడువు విధించినట్టు ‘ది వెర్జ్’ వెబ్సైట్ వెల్లడించింది. ప్రస్తుతం ట్విట్టర్లో బ్లూటిక్ సహా అదనపు ఫీచర్లను ‘ట్విట్టర్ బ్లూ’ పేరుతో నెలకు 4.99 డాలర్లకే వినియోగదారులకు అందిస్తున్నారు. ఈ ప్యాక్లో ప్రకటనలు (యాడ్స్) లేని ఆర్టికల్స్, ప్రత్యేక రంగుతో ఉండే హోంస్క్రీన్ ఐకాన్ అంతర్భాగంగా ఉంటాయి.
ఇకపై ఈ సేవలకు అదనంగా మరో 15 డాలర్లు వసూలు చేయాలని ఎలాన్ మస్క్ ట్విట్టర్ ఉద్యోగులను ఆదేశించారు. దీనిలో పెయిడ్ వెరిఫికేషన్ను కూడా జోడించి బ్లూటిక్ బ్యాడ్జ్ను అందించనున్నట్టు తెలుస్తున్నది. ఇప్పటివరకు బ్లూటిక్ మాత్రమే కావాలనుకొనేవారి నుంచి ఎలాంటి రుసుము వసూలు చేయడం లేదు. కానీ, తాజాగా బ్లూటిక్ను పెయిడ్ వెర్షన్లో భాగంగా చేయడంతో ప్రత్యేకంగా రుసుము చెల్లించాల్సి ఉంటుంది. కాగా, ప్రపంచవ్యాప్తంగా ఇన్స్టాగ్రామ్ సేవల్లో అంతరాయం ఏర్పడింది. చాలామంది ఖాతాలు సస్పెండ్ అయ్యాయి. దీంతో వినియోగదారుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీనిపై స్పందించిన ఇన్స్టాగ్రామ్.. సేవల్లో అంతరాయం కలిగినందుకు క్షమాపణ తెలిపింది.