టోక్యో: జపాన్ ప్రధాని యోషిహిడే సుగా పార్టీ నాయకత్వానికి గుడ్బై చెప్పారు. దీంతో ఆయన ప్రధాని బాధ్యతలను కూడా త్యజించనున్నారు. ఏడాది క్రితమే జపాన్ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన సుగా.. కరోనా నియంత్రణలో విఫలం అయ్యారు. దీంతో ఆయన రేటింగ్ దారుణంగా పడిపోయింది. ఈ నెలలో జరగనున్న ఎన్నికల్లో పార్టీ నాయకత్వం నుంచి తప్పుకుంటున్నట్లు ఇవాళ ఆయన ప్రకటించారు. మాజీ ప్రధాని షింజో అబే రాజీనామా చేయడంతో.. ఆ పదవిని సుగా చేజిక్కించుకున్నారు. తన ప్రకటనతో అందర్నీ షాక్కు గురిచేసిన సుగా.. మళ్లీ ప్రధాని పదవికి పోటీచేయనన్నారు. కోవిడ్ వేవ్తో ఇబ్బందిపడుతున్న జపాన్లో ఇంకా ఎమర్జెన్సీ నడుస్తోంది. ఒలింపిక్స్, పారాలింపిక్స్ నిర్వహణతో ప్రభుత్వంపై నెగటివ్ టాక్ వచ్చింది. జపాన్లో ఇప్పటి వరకు 15 లక్షల కేసులు నమోదు అయ్యాయి. వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా చాలా మందకొడిగా సాగుతోంది.
ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన ఏడాది కాలం నుంచి .. దేశం ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను పరిష్కరించేందుకు శక్తినంతా ధారపోశానని, కరోనా నియంత్రణ కోసం ఎంతో శ్రమించినట్లు సుగా తెలిపారు. ఎన్నికలకు వెళ్లాలా లేక వైరస్ను నియంత్రించాలా.. ఈ రెండింటిని చేయాలంటే విపరీతమైన శక్తి కావాలని, అయితే రెండింటిని ఒకేసారి చేయలేనని గుర్తించానన్నారు. ఏదో ఒకదాన్ని ఎంపిక చేసుకోవాలన్న ఆలోచనకు వచ్చినట్లు ప్రధాని సుగా తెలిపారు. ప్రధాని సుగా తీసుకున్న నిర్ణయం పట్ల లిబరల్ డెమోక్రటిక్ పార్టీ కార్యదర్శి తొషిహిరో నికాయ్ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు.