Xi Jinping unhealth | ఆధిపత్య పాలిటిక్స్లో అమెరికా తర్వాత స్థానం.. ఆ మాటకొస్తే ఆర్థికంగా అగ్రరాజ్యం అమెరికాపై పైచేయి సాధించిన దేశం చైనా.. ప్రపంచ దేశాలతో ద్వైపాక్షిక, వ్యూహాత్మక ఆర్థిక సంబంధాలు నెలకొల్పుకోవడం ద్వారా అగ్రరాజ్యంపై పైచేయి సాధించిందంటారు.. అటువంటి చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ అంతు చిక్కని వ్యాధితో బాధ పడుతున్నారట.. గతేడాది చివర్లో ఆసుపత్రి పాలయ్యారట. ఆయన సెరిబ్రల్ అనైర్య్సమ్ అనే వ్యాధి బారిన పడ్డారని వార్తలొస్తున్నాయి.
అయితే, ఆ వ్యాధి సోకిన వారికి శస్త్ర చికిత్స చేయాల్సి ఉంటుంది. కానీ, జీ జిన్పింగ్ సంప్రదాయ చైనా ఔషధాలు మాత్రమే వాడి నయం చేసుకోవాలని భావిస్తున్నారు. అందువల్లే బయటి ప్రపంచానికి దూరంగా ఉంటున్నారని సమాచారం. రెండేండ్ల క్రితం కొవిడ్-19 మహమ్మారి వెలుగు చూసినప్పటి నుంచి బీజింగ్ వింటర్ ఒలింపిక్స్ వరకు విదేశీ నేతలతో భేటీలను జీ జిన్పింగ్ దాట వేశారని వార్తలొచ్చాయి.
అంతకుముందు 2019 మార్చిలో ఇటలీ పర్యటనలో నడవడానికి ఇబ్బంది పడ్డారని వదంతులు ఉన్నాయి. అటుపై ఫ్రాన్స్లో పర్యటిస్తున్నప్పుడు కూర్చునేందుకు సహాయకుల మద్దతు తీసుకున్నారని సమాచారం. 2020లో షెన్జెన్లో జరిగిన బహిరంగ సభలో మాట్లాడేందుకు ఆలస్యంగా వచ్చారని చెబుతారు. మధ్యమధ్యలో దగ్గుతూ నెమ్మదిగా తన ప్రసంగాన్ని పూర్తి చేయడాన్ని బట్టే జీ జిన్పింగ్ అనారోగ్యం పాలయ్యారన్న వార్తలకు రెక్కలొచ్చాయి.
మెదడులోని రక్త నాళాలు ఉబ్బడంతో.. బ్రెయిన్లో రక్తం నిండిపోతుంది. అనౌర్య్సమ్ అంటే ఎటువంటి లక్షణాలు లేకుండా రక్తనాళాల నుంచి బ్లడ్ లీక్ అవుతూ ఉంటుంది. తీవ్రమైన తలనొప్పి నుంచి ప్రాణాంతక స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంది. అనౌర్య్సమ్లోకి రక్తం సరఫరాను అడ్డుకునేందుకు విభిన్న పద్దతులు అవలంభిస్తారు. అనౌర్యసమ్లోకి అవసరానికి మించి రక్తం సరఫరా కాకుండా దారి మళ్లిస్తారు.