లండన్: సామాజిక మాధ్యమం ఎక్స్ (గతంలో ట్విటర్)ను ఎలాన్ మస్క్ దివాలా దిశగా నడుపుతున్నట్లు ప్రముఖ న్యూస్ నెట్వర్క్ జోస్యం చెప్పింది. 44 బిలియన్ డాలర్లకు ఈ కంపెనీని ఆయన సొంతం చేసుకున్నారని తెలిపింది. దీనిలో దాదాపు 13 బిలియన్ డాలర్లు రుణాలేనని చెప్పింది. ఈ రుణాలపై సంవత్సరానికి వడ్డీ 1.2 బిలియన్ డాలర్లతోపాటు, ఉద్యోగులకు జీతాలు చెల్లించవలసి ఉంటుందని తెలిపింది.
అయితే మస్క్ ఇటీవల యూదు వ్యతిరేక పోస్ట్కు మద్దతివ్వడంతో డిస్నీ, యాపిల్, వాల్మార్ట్ వంటి పెద్ద సంస్థలు ఈ వేదికపై వ్యాపార ప్రకటనలు ఇవ్వబోమని ప్రకటించాయని పేర్కొన్నది. గత ఏడాది ఎక్స్ ఆదాయంలో దాదాపు 90 శాతం వరకు ప్రకటనల ద్వారా వచ్చిందని తెలిపింది. పెద్ద అడ్వర్టయిజర్ల నిర్ణయం వల్ల ఎక్స్ మూతపడే పరిస్థితి వస్తుందని మస్క్ కూడా ఇటీవల సంకేతాలు ఇచ్చారు. ఇదిలావుండగా, యూదు వ్యతిరేక పోస్ట్కు మద్దతిచ్చినందుకు మస్క్ క్షమాపణ చెప్పినప్పటికీ ప్రయోజనం లేకపోయింది.