గ్లాస్గో: కీలక హోదాల్లో ఆడవాళ్లు ఉంటే.. భూతాపం తగ్గుతుందని ఓ సర్వే అభిప్రాయపడింది. బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్ దీనిపై అధ్యయన నివేదికను ప్రచురించింది. వాతావరణ మార్పులకు, మహిళలకు ఉన్న సంబంధంపై ఇటీవల ఓ స్టడీ నిర్వహించారు. కార్బన్ ఉద్గరాల తగ్గింపులో మహిళల పాత్ర విశేషంగా ఉన్నట్లు గుర్తించారు. ఏదైనా కంపెనీలో మహిళలు మేనేజర్ స్థాయిలో ఉంటే.. దాని వల్ల కార్బన్ ఉద్గరాల విడుదల తక్కువగా ఉంటుందని అంచనా వేశారు. పురుషులతో పోలిస్తే, మహిళా మేనేజర్ల సంఖ్య ఒక శాతం పెరిగితే, అప్పుడు కార్బన్ ఉద్గరాల విడుదల 0.5 శాతం తగ్గుతుందని బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్ తన రిపోర్ట్లో వెల్లడించింది. దీని కోసం 24 ఆధునిక దేశాల్లో రెండు వేల లిస్టెడ్ కంపెనీలను విశ్లేషించారు. 2009 నుంచి 2019 వరకు ఆ విశ్లేషణ కొనసాగింది. మహిళా మేనేజర్ల సంఖ్య పెరిగితే, దాని వల్ల కార్బన్ ఉద్గరాల విడుదల తగ్గుతుందని తేల్చారు.
బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్ .. స్విట్జర్లాండ్కు చెందినది. యేల్టర్ ఆల్టున్బాస్, లియోనార్డ్ గాంబకోర్టా, అలిసో రిగేజా, గులియో వెలిసెగ్ పరిశోధకులు తాజా రిపోర్ట్ను రిలీజ్ చేశారు. పర్యావరణ పరిరక్షణ కోసం మహిళా మేనేజర్లు ఎక్కువగా శ్రద్ధ చూపుతారని నివేదికలో తెలిపారు. సమాజ శ్రేయస్సు కోసం మహిళలే ఎక్కువగా పాటుపడుతారని, షేర్హోల్డర్ల ప్రయోజనాల కన్నా సమాజ బాగు కోసం వాళ్లు ఎక్కువగా ఆలోచిస్తుంటారని స్టడీలో తెలిపారు.