అదృష్టం అందరికీ ఉండదు. కొందరికి ఒక్కసారే లక్ష్మి తలుపు తడుతుంది. అయితే.. అదృష్టం ఎప్పుడు తలుపు తడుతుందో చెప్పడం మాత్రం కష్టం. ఇలాగే ఓ మహిళకు కూడా అదృష్టం ఈమెయిల్ స్పామ్ ఫోల్డర్ రూపంలో తట్టింది. మామూలు అదృష్టం కాదది. ఆ మహిళ ఏకంగా 22 కోట్ల రూపాయలను లాటరీ ద్వారా గెలుచుకుంది. ఈమెయిల్ స్పామ్ ఫోల్డర్ రూపంలో తనకు లాటరీ తగలడంతో ఆ మహిళ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ ఘటన యూఎస్, మిచిగాన్ లోని ఓక్లాండ్ కౌంటీలో చోటు చేసుకుంది.
లౌరా స్పియర్స్ అనే 55 ఏళ్ల మహిళ డిసెంబర్ 31న మిచిగాన్ లాటరీని కొనుగోలు చేసింది. ఆ తర్వాత దాని గురించే మరిచిపోయింది. ఆ తర్వాత ఒకరోజు ఈమెయిల్ స్పామ్ ఫోల్డర్ను చెక్ చేస్తూ ఉండగా.. లౌరాకు మిచిగాన్ లాటరీ నిర్వాహకుల నుంచి వచ్చిన మెయిల్ కనిపించింది. దాంట్లో లాటరీ గెలిచినట్టుగా ఉంది. 3 మిలియన్ డాలర్లు గెలిచినట్టుగా అందులో ఉంది. అంటే మన కరెన్సీలో సుమారు రూ.22 కోట్లు అన్నమాట. దీంతో వెంటనే తన లాటరీ అకౌంట్ను ఓపెన్ చేసి చెక్ చేసుకొని షాక్ అయింది. వెంటనే లాటరీ నిర్వాహకులకు రిప్లయి ఇచ్చి ఆ తర్వాత వెళ్లి లాటరీ ప్రైజ్ మనీని తెచ్చేసుకుంది లౌరా.
లాటరీలో గెలిచిన డబ్బుతో ముంందే రిటైర్మెంట్ ప్లాన్ చేసుకోవడంతో పాటు.. తన ఫ్యామిలీ మెంబర్స్కు ఆ డబ్బును షేర్ చేస్తానని లౌరా చెప్పుకొచ్చింది.