న్యూఢిల్లీ: కరోనా సంక్షోభం నుంచి ఇంకా పూర్తిగా కోలుకోని ప్రపంచానికి ఇప్పుడు కొత్త సంక్షోభం దడ పుట్టిస్తోంది. చైనా, ఇండియా, యూకే, యూరప్ దేశాలను కరెంటు కష్టాలు( Power Crisis ) చుట్టుముడుతున్నాయి. సహజ వాయువు, బొగ్గు, ఇతర ఇంధన వనరులు డిమాండ్కు సరిపడా ఉత్పత్తి కావడం లేదు. ఇండియాలో బొగ్గు నిల్వలు తగ్గిపోతున్నాయని రాష్ట్రాలు గగ్గోలు పెడుతున్నాయి. ఇది ఇలాగే కొనసాగితే విద్యుదుత్పత్తి తగ్గిపోయి అంధకారంలోకి వెళ్లే పరిస్థితి వస్తుందని ఆందోళన చెందుతున్నాయి. మరోవైపు యూరప్లో సహజ వాయువు ధరలు భారీగా పెరిగిపోయాయి.
అటు యూకేలో ఇప్పటికే పెట్రో ఉత్పత్తుల కొరత కారణంగా ఎన్నో పెట్రోల్ పంపులు మూత పడ్డాయి. ఇటు చైనాలో కరెంటు సంక్షోభం ముదురుతోంది. అక్కడా బొగ్గు కొరత కారణంగా థర్మల్ విద్యుదుత్పత్తికి ఆటంకం ఏర్పడటంతో ఎన్నో ఫ్యాక్టరీలు మూత పడే పరిస్థితి వచ్చింది. ఇటు లెబనాన్ ఇప్పటికే పూర్తిగా అంధకారంలోకి వెళ్లిపోయింది. ఈ నేపథ్యంలో అసలు ప్రపంచానికి ఈ ఇంధన ముప్పు ఎందుకు వచ్చింది? ఇది ఇంకెంత కాలం ఉండనుంది? ఇండియాలో పరిస్థితి ఏంటన్నది ఒకసారి చూద్దాం.
ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు భారీగా పెరిగిపోతున్నాయి. దీనికి కూడా కరోనా మహమ్మారే కారణంగా కనిపిస్తోంది. కరోనా సమయంలో పూర్తిగా మందగించిన ఆర్థిక కార్యకలాపాలు.. ఆ మహమ్మారి తగ్గుముఖం పట్టగానే ఒక్కసారిగా మునుపటి స్థితికి చేరుకున్నాయి. అయితే అదే స్థాయిలో ఉత్పత్తి మాత్రం పెరగలేదు. అదే కరోనా మహమ్మారి కారణంగా సరఫరా వ్యవస్థ దెబ్బతినడం కూడా దీనికి మరో కారణంగా కనిపిస్తోంది.
ఇక మరో ప్రధాన కారణాన్ని కూడా నిపుణులు ఉదాహరణగా చెబుతున్నారు. ఇప్పుడు ప్రపంచమంతా హరిత జపం చేస్తోంది. పర్యావరణ మార్పులను తగ్గించడానికి సాంప్రదాయ శిలాజ ఇంధనాలపై ప్రభుత్వాలు ఆంక్షలు విధిస్తున్నాయి. పునరుత్పాదక ఇంధన వనరులను ప్రోత్సహిస్తున్నాయి. చైనా అయితే 2030లోపు 65 శాతం మేర కర్బన ఉద్గారాలను తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇది బొగ్గు మైనింగ్పై తీవ్ర ప్రభావం చూపింది. అది చివరికి కరెంటు ఉత్పత్తిని ప్రభావితం చేసింది.
అటు యూకే కూడా కరెంటు కోసం పవన విద్యుత్తుపై ఎక్కువగా ఆధారపడుతోంది. దేశంలో 25 శాతం విద్యుత్తు దీని ద్వారానే ఉత్పత్తి చేస్తున్నారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లు కూడా సాంప్రదాయ ఇంధన వనరుల్లో తక్కువ పెట్టుబడులు పెడుతున్నారు. డిమాండ్కు తగినట్లుగా సరఫరా జరగకపోవడానికి ఇది కూడా ప్రధాన కారణం. 2015, 2021 మధ్య అమెరికా, యూరప్ ఆయిల్ కంపెనీల్లో ఆయిల్, గ్యాస్ రంగాల్లో పెట్టుబడులు 50 శాతం మేర తగ్గిపోయినట్లు నిపుణులు చెబుతున్నారు.
ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు పెరిగిపోతుండటంతో ఆయా దేశాల ఆర్థిక నిర్ణయాలపైనా ప్రభావం పడుతోంది. యూరప్లో సహజ వాయువు ధర ఈ ఏడాది 400 శాతం, విద్యుత్తు ధర 250 శాతం మేర పెరిగింది. చైనాలో కరెంటు సంక్షోభం కారణంగా ఫ్యాక్టరీల్లో ఉత్పత్తి భారీగా తగ్గిపోయింది. ఇండియాలో ఇళ్లలో వాడే సహజ వాయువు గత వారం 60 శాతానికిపైగా పెరిగింది. అంతర్జాతీయంగా బొగ్గు ధరలు పెరగడంతో దేశంలోని థర్మల్ విద్యుదుత్పత్తి కంపెనీలు దిగుమతులను తగ్గించాయి. ఇది కరెంటు ఉత్పత్తిని ప్రభావితం చేసింది.
దీంతో రాష్ట్రాలు గగ్గోలు పెడుతున్నాయి. తమకు బొగ్గు సరఫరా పెంచాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నాయి. పంజాబ్, ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, రాజస్థాన్ రాష్ట్రాలు బొగ్గు కొరతను ఎదుర్కొంటున్నాయి. బీహార్, జార్ఖండ్, రాజస్థాన్, గుజరాత్లాంటి రాష్ట్రాలు తీవ్ర విద్యుత్తు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. ఇండియాలో మొత్తం 135 థర్మల్ విద్యుత్ కేంద్రాలు ఉన్నాయి. దేశ విద్యుత్ డిమాండ్లో 70 శాతం ఇవే తీరుస్తున్నాయి. ఈ కేంద్రాల్లో సగానికి పైగా కేవలం వారం రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు మాత్రమే ఉన్నాయి. ఇది ఇలాగే కొనసాగితే ఇండియాలో కూడా చైనాలాంటి పరిస్థితులు రావడానికి పెద్దగా సమయం పట్టేలా లేదు.
మరికొంత కాలం ఈ ఇంధన సంక్షోభం కొనసాగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. డిమాండ్కు తగినట్లు ఉత్పత్తి పెంచడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉంది. ఈ సంక్షోభానికి ప్రభుత్వాలు ఎలా స్పందిస్తాయన్నది కూడా ఇది ఎంతకాలం కొనసాగుతుందన్న దానిపై ప్రభావం చూపనుంది. చాలా ప్రభుత్వాలు ఇలాంటి సమయాల్లో ధరలపై విధించే ఆంక్షలు పరిస్థితిని మరింత తీవ్రం చేసే ప్రమాదం ఉంది.
బొగ్గు ధరలు భారీగా పెరిగినా చైనాలో ప్రభుత్వం విద్యుత్ ధరలపై పరిమితి విధించడంతో అక్కడి థర్మల్ ప్లాంట్లు చాలా వరకూ మూతపడ్డాయి. ఇండియాలోనూ విద్యుత్ ధరలు పెంచితే వ్యతిరేకత వచ్చే ప్రమాదం ఉండటంతో ప్రభుత్వాలు ఆ ప్రతిపాదనను వ్యతిరేకించవచ్చు. ఇది ఉత్పత్తి పెంచే దిశగా విద్యుదుత్పత్తి సంస్థలను నిరుత్సాహపరుస్తుంది. తద్వారా సంక్షోభం మరింత ముదరవచ్చు.