ముంబై: ఐదేళ్ల కిందట పనామా పేపర్స్ పేరుతో ప్రముఖుల విదేశీ ఆస్తుల చిట్టా సంచలనం సృష్టించిన విషయం తెలుసు కదా. తాజాగా ఇప్పుడు వెలుగు చూసిన పండోరా పేపర్స్( Pandora Papers ) మరిన్ని ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇది క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్తోపాటు రిలయెన్స్ ఏడీఏజీ ఓనర్ అనిల్ అంబానీ, నీరవ్ మోదీ సోదరి పూర్వీ మోదీ, కిరణ్ మజుందార్ షా భర్త జాన్ మెక్కలమ్ మార్షల్ షా, బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్, కార్పొరేట్ లాబీయిస్ట్ నీరా రాడియాల విదేశీ ఆస్తుల చిట్టాను ఈ పండోరా పేపర్స్ బయటపెట్టింది. ఇండియన్సే కాదు మొత్తం 91 దేశాల్లోని ప్రస్తత, మాజీ ప్రపంచ నేతలు, రాజకీయ నాయకులు, అధికారులు, ప్రముఖుల పేర్లు ఇందులో ఉన్నాయి. అయితే సచిన్ గురించి ఇందులో ఏముందో ఒకసారి చూద్దాం.
తాజాగా బయటకు వచ్చిన ఈ పండోరా పేపర్స్లో సచిన్తోపాటు అతని భార్య అంజలి టెండూల్కర్, మామ ఆనంద్ మెహతా పేర్లు కూడా ఉన్నాయి. ఈ పండోరా పేపర్స్లో భాగమైన పనామా న్యాయసంస్థ ఆల్కగాల్లోని రికార్డుల ప్రకారం.. ఈ ముగ్గురూ బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్కు చెందిన Saas International Limited కంపెనీలో బెనిఫిషియల్ ఓనర్లు, డైరెక్టర్లుగా ఉన్నారు. గతంలో పనామా పేపర్స్ సంచలనం సృష్టించిన మూడు నెలల తర్వాత బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్లోని తన సంస్థ లిక్విడేషన్ను సచిన్ కోరినట్లు ఇండియన్ ఎక్స్ప్రెస్ పత్రిక వెల్లడించింది. ఈ సంస్థను 2016, జులైలో మూసేశారు.
అయితే సచిన్ చేసిన ఈ పెట్టుబడి చట్టబద్ధమైనదే అని అతని తరఫు లాయర్ చెబుతున్నారు. ఈ ఇన్వెస్ట్మెంట్ విషయాన్ని పన్ను అధికారులకు కూడా చెప్పినట్లు తెలిపారు. అటు సచిన్ టెండూల్కర్ ఫౌండేషన్ సీఈవో మృన్మయ్ ముఖర్జీ కూడా ఇదే విషయం చెప్పారు. ఆ పెట్టుబడుల గురించి సచిన్ తన ట్యాక్స్ రిటర్న్స్లో వెల్లడించారు. ఆ నిధులపై పన్ను కూడా చెల్లించారు. ఇక ఇందులో చట్టవిరుద్ధంగా సచిన్ చేసిందేముంది అని ఆయన అన్నారు.
2016లో సంచలనం సృష్టించిన పనామా పేపర్స్ ప్రాజెక్ట్కే ఈ పండోరా పేపర్స్ కొనసాగింపు. దీనిని ఇంటర్నేషనల్ కన్సార్టియమ్ ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టులు (ఐసీఐజే) రూపొందించారు. ఇందులో మొత్తం 3 టెరాబైట్ల డేటా ఉంది. ప్రపంచంలో 38 దేశాల పరిధిలో పని చేస్తున్న 14 విభిన్న సర్వీస్ ప్రొవైడర్ల నుంచి ఈ డేటా లీకైంది. 1970లకు సంబంధించిన రికార్డులు కూడా ఇందులో ఉన్నాయి. అయితే ఎక్కువ భాగం 1996-2020 మధ్యలో ఉన్నవే. ప్రముఖుల విదేశీ ఆస్తుల చిట్టాను ఈ పండోరా పేపర్స్ గతంలోని పనామా పేపర్స్ కంటే ఎక్కువగానే కవర్ చేసింది.