మాస్కో: పశ్చిమ దేశాలు బందిపోట్ల మాదిరిగా వ్యవహరిస్తున్నాయని రష్యా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉక్రెయిన్పై దండయాత్ర నేపథ్యంలో పశ్చిమ దేశాలు విధిస్తున్న ఆర్థిక ఆంక్షలపై మండిపడింది. చాలా పెద్దదైన రష్యాను ప్రపంచం నుంచి వేరు చేయడం సాధ్యం కాదని తెలిపింది. అమెరికా, ఐరోపా కన్నా ప్రపంచం చాలా విస్తృతమైందని వ్యాఖ్యానించింది. రష్యా అధికార ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ మీడియాతో శనివారం మాట్లాడారు. పశ్చిమ దేశాలు రష్యాకు వ్యతిరేకంగా ‘ఆర్థిక బందిపోటు’ మాదిరిగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. అయితే వాటి చర్యలను తిప్పికొడతామని, రష్యాకు అనుగుణంగా ప్రతి చర్యలు ఉంటాయని చెప్పారు.
కాగా, రష్యా ఒంటరిగా ఉంటుందని దీని అర్థం కాదని పెస్కోవ్ తెలిపారు. అమెరికా, ఐరోపా కలిసి ఒక దేశాన్ని వేరు చేసేంతగా ప్రపంచం లేదని, అది చాలా విశాలమైందని చెప్పారు. ప్రపంచంలో చాలా దేశాలు ఉన్నాయని, రష్యా కూడా చాలా పెద్ద దేశమని అన్నారు. ఈ నేపథ్యంలో రష్యా ఇంధన ఎగుమతులపై అమెరికా ఆంక్షలు విధిస్తే ప్రపంచ ఇంధన మార్కెట్లో కుదుపు వస్తుందని ఆయన హెచ్చరించారు.
మరోవైపు తమ సైన్యం గురించి తప్పుడు వార్తలు ప్రచురించే వ్యక్తులకు 15 ఏండ్లు జైలు శిక్ష విధించేలా తెచ్చిన కొత్త చట్టాన్ని రష్యా సమర్థించుకున్నది. సమాచార యుద్ధాన్ని కూడా తమ దేశం ఎదుర్కొంటోందని తెలిపింది. స్వతంత్ర జర్నలిజాన్ని తగ్గించడడానికి కొత్త చట్టం శక్తివంతమైన అధికారాలు ఇస్తుందని వివరించింది.
కాగా, కొత్త చట్టంలో భాగంగా తమ దేశంలో రిపోర్టింగ్ను నిలిపివేయాలని బీబీసీ, బ్లూమ్బెర్గ్ వంటి ఇతర విదేశీ మీడియా సంస్థలను రష్యా ఆదేశించింది. అలాగే ఫేస్బుక్తోపాటు కొన్ని వెబ్సైట్లను బ్లాక్ చేసింది.