వాషింగ్టన్: ఢిల్లీలో జరిగిన జీ20(G20 meeting) దేశాల సదస్సు సక్సెస్ అయినట్లు అమెరికా తెలిపింది. ఆ సమావేశాలకు జో బైడెన్ కూడా హాజరైన విషయం తెలిసిందే. అయితే సోమవారం అమెరికా ప్రభుత్వ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ మీడియాతో మాట్లాడుతూ.. జీ20 సక్సెస్ అయినట్లు నమ్ముతున్నామని అన్నారు. జీ20 ఓ పెద్ద సంస్థ అని, రష్యా, చైనా దేశాలు ఆ సంస్థలో సభ్యదేశాలని ఆయన అన్నారు. మీడియా అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. జీ20 సక్సెస్ అయినట్లు విశ్వసిస్తున్నామన్నారు.
ఢిల్లీ డిక్లరేషన్కు రష్యా గైర్హాజరు అయ్యిందన్న దానిపై ఆయన స్పందిస్తూ.. సభ్యదేశాల్లో భిన్న అభిప్రాయాలు ఉంటాయని, ప్రాంతీయ సమగ్రతను, సార్వభౌమతాన్ని గౌరవించాలన్న అంశాన్ని డిక్లరేషన్లో చేర్చామని, ఉక్రెయిన్పై రష్యా ఆక్రమణ చేపట్టిన నేపథ్యంలో ఆ డిక్లరేషన్ కీలకమైందని ఆయన తెలిపారు. అణు బెదిరింపులకు పాల్పడడం కానీ, అణ్వాయుధాలు వాడడం కానీ అమోదయోగ్యం కాదు అని డిక్లరేషన్లో ఉన్నట్లు చెప్పారు.