వాషింగ్టన్: అమెరికాలో పనిచేస్తున్న హెచ్-1బీ వీసాదారులు, ఇతర విదేశీ కార్మికుల వేతనాలు పెంచాలని యోచిస్తున్నట్టు ట్రంప్ యంత్రాంగం ప్రకటించింది. అమెరికన్ల ఉద్యోగాలను కాపాడేందుకు ఆ దేశ కార్మిక శాఖ ఈ ప్రతిపాదన చేసింది. ప్రస్తుతం అమెరికన్లకు ఆయా కంపెనీలు తక్కువ వేతనాలు చెల్లించడం, జీతం ఎక్కువ డిమాండ్ చేసిన వారిని ఉద్యోగాల్లోంచి తీసేసి తక్కువ వేతనానికి పనిచేసే వలస కార్మికులను నియమించుకుంటున్నాయని ఆరోపణలు ఉన్నాయి. దానిని నిరోధించడానికి అమెరికా కార్మిక శాఖ ఈ ప్రతిపాదనను ముందుకు తెచ్చింది.
దీని కారణంగా అమెరికా దేశస్థులకు అధిక సంఖ్యలో ఉద్యోగాలు రావడమే కాక, వారికి ఉద్యోగ భద్రత ఏర్పడుతుందని పేర్కొన్నది. ఈ కొత్త నిబంధనల ప్రకారం అమెరికాలోని కంపెనీలు హెచ్-1బీ వీసా, కొన్ని రకాల గ్రీన్కార్డు విభాగాలకు చెందిన విదేశీ కార్మికులను నియమించుకుంటే వారికి గణనీయంగా అధిక వేతనాలు తప్పనిసరిగా చెల్లించాలి. అమెరికన్ల జీతాలను తగ్గించడాన్ని నిరాకరించే లక్ష్యంతో ట్రంప్ యంత్రాంగం ఈ నిబంధనలను ప్రతిపాదించిందని బ్లూమ్బర్గ్ నివేదించింది. ఈ చర్య విదేశీ కార్మికులకు అమెరికన్ ఉద్యోగులతో సమానంగా వేతనాలు అందేలా నిర్ధారిస్తుందని పేర్కొన్నది.