ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి వేదికగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సంచలన వ్యాఖ్యలు చేశారు. యుద్ధ సమయంలో తమ పౌరుల మీద నుంచి రష్యా సైనికులు ట్యాంకులను ఎక్కించారని సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే వారి వారి పిల్లల ముందే ఉక్రెయిన్ మహిళలపై అత్యాచారాలు చేసి, వారిని ఘోరంగా చంపేశారని ఆరోపించారు. బుచా వేదికగా రష్యా సైనికులు అత్యంత క్రూరంగా వ్యవహరించారని తీవ్రంగా మండిపడ్డారు. ఇలా ఉక్రెయిన్ పౌరులపై అఘాయిత్యాలకు పాల్పడాలని ఆదేశించిన వారిని అంతర్జాతీయ న్యాయస్థానానికి ఈడ్చుకురావాలని జెలెన్స్కీ పరోక్షంగా పుతిన్పై విరుచుకుపడ్డారు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి నుంచి రష్యాను వెంటనే తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు.
రష్యా అధ్యక్షుడు పుతిన్ తమపై ఇంత ఘోరంగా విరుచుకుపడుతున్నా.. భద్రతా మండలి రక్షణ కల్పించాల్సి వుందని, ఆ సమయంలో ఏమయ్యారని జెలెన్స్కీ సూటిగా నిలదీశారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఇంత పెద్ద ఘోరం ఎక్కడా జరగలేదని, రష్యా అంత ఘోరంగా వ్యవహరించిందని జెలెన్స్కీ నిప్పులుగక్కారు. తమను నిశ్శబ్ద బానిసలుగా మార్చేయాలని పుతిన్ తెగ వ్యూహాలు వేశారని, రష్యా చేసిన ప్రతి పనికీ జవాబుదారీగా ఉండాలని జెలెన్స్కీ డిమాండ్ చేశారు.
అచ్చు తీవ్రవాదుల్లాగే చేశారు.. జెలెన్స్కీ
రష్యా సైన్యంపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ భద్రతా మండలి వేదికగా సంచలన ఆరోపణలు చేశారు. ఉక్రెయిన్లో రష్యా సైన్యం అచ్చు తీవ్రవాదుల్లాగే ప్రవర్తించిందని అభివర్ణించారు. తీవ్రవాదులకు, రష్యా సైనికులకు ఎక్కడా భేదం లేదని దెప్పిపొడిచారు. తమ జాతిని, తమ సాంస్కృతిక పద్ధతులను నాశనం చేస్తూ.. చివరికి యుద్ధం వైపు వచ్చాయని అన్నారు. కొందర్ని రోడ్లపైనే హత్య చేశారని, మరి కొందర్ని బావుల్లో విసిరేశారని, ఇళ్లపైకి గ్రెనైడ్లు విసిరారని జెలెన్స్కీ పేర్కొన్నారు.